మళ్లీ అదే చేశారు.. అనుకున్నదే కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోయిన వారు లేరు. మోదీ ప్రభుత్వం చేస్తే తప్పంటూ వరుస పెట్టి విమర్శలు చేసిన నేతలు.. వారికి సంబంధించి మీడియా.. ఇప్పుడు అస్మదీయులు చేయగానే ఆహా.. ఓహో అంటూ కీర్తిస్తున్నారు.. ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదంతా దేని గురించి అంటారా? అదేనండి శాసనసభలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర.. కాదు పూర్తిస్థాయి బడ్జెట్ గురించి. మంగళవారం ఉదయం 11:45 గంటలకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే స్థోమతకు మించి అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజా బడ్జెట్లో కూడా అప్పులతోపాటు రాని ఆదాయ వనరులను చూపిస్తూ కాగితాలపై భారీగా కేటాయింపులు చేసింది. రూ.2,26,177.53 కోట్ల కేటాయింపులతో పూర్తిస్థాయి బడ్జెట్ను యనమల ప్రవేశపెట్టారు.
అన్నదాత సుఖీభవ పథకం పేరుతో మరోసారి వైఎస్ జగన్ను ఫాలో అయ్యారు చంద్రబాబు. దీనికోసం బడ్జెట్లో రూ. ఐదువేల కోట్లు కేటాయించారు. కాగా వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఏటా రైతులకు రూ.12,500 పెట్టుబడి సాయం ఇస్తామని వైఎస్ జగన్ హామి ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదు అంటే మాత్రం సమాధానం లేదు.
పాదయాత్రలో బీసీ కులాలకు ప్రత్యే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఖంగుతిన్న చంద్రబాబు యాదవ, తూర్పుకాపు, మత్స్యకారులతో సహా తదితర కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. గత బడ్జెట్లో బీసీ కులాలను పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం… తాజాగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కార్పొరేషన్లు ప్రకటించింది. కానీ నిధుల సంగతి గురించి మాత్రం చెప్పలేదు.
ఇక డ్వాక్రా రుణాల మాఫీ సంగతి అయితే దారుణం. వడ్డీలేని రుణాల బాకాయిలు రూ.2,350 కోట్లు ఉండగా, బడ్జెట్లో కేవలం రూ.1100 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించింది. రెండేళ్లుగా వడ్డీలేని రుణాల బాకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదు.
బీసీ సబ్ ప్లాన్ కోసం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తామన్న చంద్రబాబు… గడిచిన నాలుగు బడ్జెట్ సంవత్సరాల్లో ఖర్చు చేసింది రూ.16 వేల కోట్లు మాత్రమే. నిరుద్యోగభృతి కోసం గత బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించి రూ. 116 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ సారి భృతి రెట్టింపు చేస్తామంటూ కేవలం రూ.1200 కోట్లే కేటాయించారు. దీన్ని బట్టే అర్థమవుతోంది.. ఇది పూర్తిగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన బడ్జెట్ మాత్రమే అని. ఏదేమైనా పేరుకే ఎన్డీఏ-టీడీపీ విడిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లను చూస్తుంటే.. చంద్రబాబు మోదీ దారిలోనే నడుస్తున్నట్టు అర్థమవుతుంది. నాలుగేళ్లు కలిసి పనిచేశారు కదా.. అంత తొందరగా వదలడం కష్టమేలే!!!