ఆటలో అరటిపండు కాకూడదని జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు దేశంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక సమర్థులైన నాయకుల కొరత ఆ పార్టీని వెంటాడుతోంది. మోడీషాలు , బీజేపీ సీనియర్లు తప్పితే అన్ని పదవులకు నాయకులు దొరకని పరిస్థితి. కాంగ్రెస్ లో కురువృద్ధులైన సమర్థులైన నేతలు ఎందరో ఉన్నా ఆ పార్టీ అధికారంలో లేదు. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చినా అంతా కొత్త వారే. దీంతో పదవులకు సమర్థులైన సీనియర్లు దొకరని పరిస్థితి నెలకొంది.
అందుకే కేవలం రెండోసారి గెలిచిన రాజస్థాన్ ఎంపీకి స్పీకర్ పదవిని మోడీ కట్టబెట్టాడు. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని దక్షిణాదికి అందునా స్నేహంగా ఉంటున్న వైసీపీకి ఇవ్వడానికి బీజేపీ సంకేతాలు పంపినట్టు తెలిసింది. అయితే ఈ ఆఫర్ ను జగన్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం..
ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకుంటే వచ్చే లాభాలేవీ లేవని.. దానివల్ల బీజేపీకి దగ్గరయ్యామన్నా సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రత్యేక హోదాపై గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని.. అందుకే డిప్యూటీ స్పీకర్ పదవి వద్దన్నట్టు సమాచారం.
అయితే చంద్రబాబుకు ఇలానే పదవుల ఆశ చూపి బీజేపీ ఉచ్చులోకి లాగింది. చివరకు హోదా ఇవ్వకుండా మోసం చేసి బాబును ఎటూ కాకుండా చేసింది. అందుకే బీజేపీ ట్రాప్ లో పడవద్దని జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.