పక్కరాష్ట్రం కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ బలంగా ఉంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి ఆశ లేదు. కానీ మొన్నటి పార్లమెంట్ ఎన్నికలతో తెలంగాణపై బీజేపీ గురిపెట్టింది. ఇక్కడ వచ్చే ఎన్నికల నాటికి బలపడాలని స్కెచ్ గీస్తోంది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తమ కార్యాచరణను బయటపెట్టారు. మోడీ షాలు తెలంగాణపై గురిపెట్టారని.. కర్ణాటక తర్వాత బలపడేందుకు అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణనే అని తేల్చారని సంచలన విషయాలు చెప్పారు. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఇలా ఉద్యమ పంథాలో వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ను ఓడించడమే ధ్యేయంగా ముందుకు వెళతామని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో ప్రధానంగా టీఆర్ఎస్ ఎంఐఎంతో జతకట్టడాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. దాంతోపాటు ఉద్యమాలుకు శ్రీకారం చుడుతోందని అర్థమవుతోంది.
ఇప్పటికే తెలంగాణ ఇంటర్ అవకతవకలపై బీజేపీ చేసిన ఉద్యమానికి , నిరాహార దీక్షకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో బలపడడానికి బీజేపీ ఈ మార్గాన్ని ఎంచుకోవడం ఆసక్తిగా మారింది.