ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్రరాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నచ్చిందో లేక.. వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా తమ పార్టీకి లేదని సర్వేలన్ని కోడై కూస్తున్నారని ముందే మేలుకున్నారో తెలియదు కానీ.. అధికార పార్టీ నేతలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బాట పడుతున్నారు.
ఇదిలా ఉంటే పార్టీ మారిన నేతలపై ఏమైనా వ్యాఖ్యాలు చేద్దామన్నా.. ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉంది టీడీపీ నేతల పరిస్థితి. దీనిని ఫిరాయింపు అనలేం. ఎందుకుంటే వెళ్లేది అధికారం చేతిలో ఉన్న పార్టీ కాదు.. అదీకాక మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. పార్టీ మారిన నేతలంతా వైఎస్ఆర్సీపీ గుర్తుపై పోటీ చేయనున్నారు. పోని ఆకర్ష్ పథకం అందామా అంటే దానికి ఛాన్స్ లేకుండా పోయింది. అధికార పార్టీ.. విపక్ష పార్టీ నేతలకు గాలం వేయడాన్ని ఆకర్ష్ అనవచ్చు. ఇక్కడా ఆ ఛాన్స్ లేదు. పైపెచ్చు తన పార్టీలో చేరే నేతలు తమ పదవికి రాజీనామా చేశాకే వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోవాలని జగన్ షరతు పెడుతుండటంతో టీడీపీ నేతలకు ఎక్కడా విమర్శించే ఛాన్స్ దొరకడం లేదు.
2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసిన చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ రెక్కలు విరిచానని ఆనందపడ్డ చంద్రబాబు… ఇప్పుడేం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు. ఇక ఆనాడు పార్టీ ఫిరాయించిన నేతలు కేవలం చంద్రబాబు అభివృద్ధిని చూసి వచ్చామని.. తమ నియోజకవర్గాల అభివృద్ధే లక్ష్యమంటూ చెప్పారు ఫిరాయింపు నేతలు.
కానీ నేడు వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ నేతలు చంద్రబాబు వ్యవహారతీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుకు కులపిచ్చి, అధికారదాహం ఎక్కువంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీంతో చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు ఏం చేయాలో ప్రస్తుతం పాలుపోవడం లేదు. గట్టిగా విమర్శించేందుకు ఎలాంటి అవకాశం కూడా లేకపోవడంతో.. చంద్రబాబు కక్కలేని మింగలేని స్థితిలో ఉండిపోయారు.