తెలంగాణాలో చెదురు..మదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గత సంవత్సరం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతంపైనే గెలుపోటములు ఆధారపడ్డాయనే వార్తలు వినిపిస్తున్నాయి. పెరిగిన ఓటుశాతం టీఆర్ఎస్, మహాకూటమి రెండు పార్టీలు మాకు అనుకూలంగా ఉందంటే లేదులేదు మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. రాజకీయ పార్టీల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షప్తమై ఉంది. ఈనెల 11న ఫలితాలు విడుదల కానున్నాయి.
ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే జాతీయ న్యూస్ ఛానల్స్ తమ సర్వేలను వెల్లడించాయి. దాదాపు అన్ని జాతీయ సర్వే ఫలితాల్లో టీఆర్ఎస్ దే అధికారం అని ఫలితాలు ప్రకటించాయి. అయితే ఆంధ్రా అక్టోపస్ లగడపాటి మాత్రం అందుకు విరుద్ధంగా తన సర్వే ఫలితాలను మీడియా ముందు తెలిపారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు.
జాతీయ ఛానళ్ల ఎగ్జిట్ పోల్స్ కంటే లగడపాటి లోకల్ కావడంతో ఆయన సర్వేకు ప్రాధాన్యత ఎక్కువ. ఈ ఎన్నికల్లో అధికారం మహాకూటమిదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి 65 స్థానాలు, టీఆర్ఎస్ 35 స్థానాలు, ఇండిపెండెంట్లు 14 స్థానాల్లో గెలుస్తారని వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్ర అభ్యర్తులు ప్రధాన పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.
అయితే ఆ ఇండిపెండెంట్లు ఎవరనేది లగడపాటి గోప్యంగా ఉంచారు. ఇప్పటికే ఇద్దరి పేర్లను వెల్లడించిన లగడపాటి మిగితా పేర్లను వెల్లడించకుండా ఉత్కంఠకు తెరలేపారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుంటే స్వతంత్ర అభ్యర్తులే ప్రభుత్వ ఏర్పాటులో ప్రధానం కానున్నారు. అదే పేర్లు వెల్లడిస్తే టీఆర్ఎస్ పార్టీ వారిని ప్రలోభ పెట్టి వారి వైపుకు తిప్పుకుంటుందనే అవకాశాలు మెండుగా ఉండనున్నాయి. అలా జరిగితే కూటమికి భారీ నష్టం జరుగుతుంది. అందుకే వారి పేర్లను వెల్లడించకుండా గోప్యత పాటించారు.
అయితే స్వతంత్ర అభ్యర్తులు ఎవరు గెలుస్తారో వారి పేర్లను చంద్రబాబుకు ఇచ్చినట్లు వార్తలు వాస్తున్నాయి. అందుకే బాబు మీడియా ముందుకు రాకుండా వెనుక రాజకీయం నడుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో సారి స్పష్టమైన ఫలితాలతో మీడియా ముందుకు వస్తానని రాజగోపాల్ ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీ భవితవ్యం, ఎవరి సర్వేలు నిజం అవుతాయో 11వ తేదీ వరకు వేచిచూడాల్సిందే…?