వైఎస్ఆర్సీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. చంద్రబాబు మీద పెరుగుతున్న ప్రజల్లో వ్యతిరేకతో.. జగన్కు పెరిగిన ప్రజాబలమో.. లేదా సర్వేలన్ని జగన్దే గెలుపు అని ఘంటాపథంగా చెప్పడమో.. కారణమేదైనా తెలుగు తమ్ముళ్లు తాము ఎక్కిన సైకిల్ షెడ్డుకు వెళుతుందని భావించి ముందే దిగేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కండువా కప్పేసుకుంటున్నారు. పనిలో పనిగా చంద్రబాబు గురించి తమకు తెలిసిన విషయాలను మైకుల ముందు కక్కెస్తున్నారు.
ఈ విషయంలో తెర వెనుక మంతనాలు జరిపి ఆచి తూచి అడుగులు వేస్తున్నారు ఆ పార్టీ కీలక నేత ఎంపీ విజయసాయి రెడ్డి. మెడా నుంచి మొదలు పెడితే నిన్నటి జై రమేష్ వరకు ఇదే సాగుతుంది. ఇక్కడ విచిత్రమేమిటంటే ఎవరూ కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ మాదే అని ప్రకటించడం లేదు.
చంద్రబాబు వ్యవహారశైలిని విమర్శిస్తూ వచ్చే ఎన్నికల్లో జగన్దే గెలుపు అంటున్నారు ఈ నెతలంతా. ఇదే సమయంలో మరో 11 మంది టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరుతారట కదా అని మీడియా వారు ప్రశ్నిస్తే మీరే చూస్తారు కదా.. అని నవ్వడమే విజయసాయి రెడ్డి వస్తున్న సమాధానం. దీనిని బట్టి మరికొంత మంది ఫ్యాన్ పార్టీలో చేరడం ఖాయంగానే కనపిస్తోంది.
అసలు ఇలా వచ్చిన వారిని వచ్చినట్టుగా చేర్చుకోవడం వెనుక వైఎస్ఆర్సీపీ నేతల ఉద్దేశ్యం ఏంటీ? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. వైఎస్ఆర్సీపీలో చేరిన వారు.. చేరబోయే వారంతా వ్యాపారాలు చేస్తున్న వారో లేక వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ దక్కదని ముందే తెలుసుకున్నవారో. అందుకే వారు ముందుగా తమ భవిష్యత్తును చూసుకుంటున్నారు.
నేతలంతా ఇలా క్యూ కట్టడానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. పార్టీలో చేరేవారు ఫిబ్రవరి లోపు రావాలని జగన్ ఆల్టిమేటమ్ జారీ చేశారని సమాచారం. తర్వాత వచ్చేవారు పార్టీలో చేరినా.. సీట్లు వచ్చే అవకాశాలు మాత్రం ఉండవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. అందుకే వలసల్లో స్పీడ్ పెరిగిందంటున్నారు.
మరోవైపు సీట్ల కేటాయింపు విషయంలో కూడా జగన్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారని సమాచారం. ఇంతకాలం తనను నమ్ముకున్న వారి గురించి ఆయన ఆలోచిస్తున్నారనే అంటున్నారు నేతలు. అందుకే చేరిన వారందరికి టికెట్ ఇస్తామని ఎక్కడా హామీలు ఇవ్వలేదంటున్నారు.
ఇలా చేరే వాళ్లలో కోవర్టులు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే లోటస్పాండ్లో ప్రతి చిన్న అలికిడి కూడా చంద్రబాబుకు తెలిసిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి జగన్ ఈ సారి తప్పులో కాలేయకుండా చూసుకోవాలంటున్నారు విశ్లేషకులు.