తెలంగాణా ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్ నాయకులకు విలక్షణమైన తీర్పును ఇచ్చారు ప్రజలు. రెండు పార్టీలకు చెందిన ప్రముఖులను చిత్తుగా ఓడించారు. అధికారపార్టీ టీఆర్ఎస్నుంచి ఏకంగా నలుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ సునామీలో ప్రజాకూటమి అభ్యర్థులు కొట్టుకుపోయారు. సాధారణ ఎమ్మెల్యేలే విజయం సాధించినప్పుడు… మంత్రులు ఎందుకు ఓడిపోయారనే అంశంపై చర్చ మొదలైంది.
ఖమ్మం నుంచి పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన మరోసారి కేబినెట్లో భాగస్వామి అవుతారా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి ప్రాతినిథ్యం వహించిన మంత్రి మహేందర్ రెడ్డి… ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో మహేందర్ రెడ్డి ఓడిపోయారు. దీంతో ఈయనకు కేబినెట్లో మరోసారి కేబినెట్లో చోటు దక్కుతుందా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. గతంలో రవాణా శాఖ మంత్రిగా మహేందర్ రెడ్డి పనిచేశారు.
జూపల్లి కృష్ణారావుమహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్లో ఓడిపోయిన మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఓటమి పాలయ్యారు. జూపల్లి వెలమ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో… ఆయన స్థానంలో పాలకుర్తికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు చోటు దక్కొచ్చని టీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అజ్మీరా చందూలాల్ ఓడిపోవడంతో ఈ సారి ఆయన కేబినెట్ బెర్త్ ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన మధుసూదనాచారి ఓడిపోవడంతో… స్పీకర్ బెర్త్ ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ మొదలైంది. నిజానికి ఈ సారి తాను గెలిస్తే కేబినెట్ పోస్టు గ్యారంటీ అనే భావనలో మధుసూదనాచారి ఉన్నారు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే సీఎం అభ్యర్తులుగా పోటీలో ఉన్న హేమాహేమీల అడ్రస్ గల్లంతయ్యింది. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో కారు హవా ముందు కాంగ్రెస్ సీనియర్లు నిల వలేకపోయారు. కుందూరు జానారెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, డి.కె.అరుణ, టి.జీవన్రెడ్డి, రేవంత్రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, కొండా సురేఖ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ, చిన్నారెడ్డి, బలరాంనాయక్, సుదర్శన్రెడ్డిలకు ప్రత్యర్థుల చేతిలో భంగపాటు ఎదురైంది. జానారెడ్డిపై రెండోసారి పోటీ పడిన నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్) విజయం సాధిం చగలిగారు.