సెలబ్రిటీలను దగ్గర నుంచి చూసే అవకాశం కల్పించే ఓ గేమ్ షో.. బిగ్బాస్. సెలబ్రిటీల జీవితంలోని మనకు తెలియని కోణాన్ని చూపించే రియాలిటీ షో ఇది. ఇప్పటికే తెలుగులో బిగ్బాస్ సీజన్ వన్ పూర్తయింది. ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ సీజన్ వన్ సూపర్ హిట్టయింది. ఇప్పుడు రెండోది నడుస్తోంది. ప్రారంభమై నెల రోజులవుతోంది. హోస్ట్గా నాని వ్యవహరిస్తున్నాడు. తారక్తో పోలిస్తే నాని తేలిపోయాడంటూ మొదటి నుంచి కామెంట్లు వచ్చాయి. దీనికితోడు బిగ్బాస్ హౌస్లో ఉండే 16మంది కంటెస్టెంట్లలో మెచ్యూరిటీ ఉన్న వాళ్లు కేవలం మోడల్, సీరియల్ యాక్టర్ కౌశల్, సామాజిక విశ్లేషకులు బాబూ గోగినేని, విలన్ వేషాలు వేసే అమిత్ తివారీ, టీవీ9 యాంకర్ దీప్తి తప్ప మరెవరూ లేరు. మిగతా 12మంది బిగ్బాస్ హౌస్కు సరిపోయేంత సామర్థ్యం ఉన్నవాళ్లు కాదు.
బిగ్బాస్ వన్లో ఉన్నంత క్లారిటీ ఉన్నవాళ్లు లేరు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం, ఎదుటి వారిని హర్టయ్యేలా మాట్లాడ్డం, చిల్లర వేషాలు వేయడం.. వంటివి బిగ్బాస్ సీజన్ 2 స్థాయిని దిగజార్చేశాయి. దీనికితోడు హౌస్లో ఉన్న తేజస్వి, తనీష్, సామ్రాట్, దీప్తిసునయన ఒక జట్టుగా మారిపోయి.. ఎదుటి వారిని టార్గెట్ చేయడం, వారిని నామినేట్ చేయడం, సూటిపోటి మాటలతో వేధించడం వంటివి చూసే వారికి నచ్చడం లేదు. దీంతో హౌస్లో చూడాలనిపించే ఆసక్తి ఏం ఉండడం లేదు. పొద్దస్తమానం.. ఈ నలుగురూ కలిసి ఓ చోట చేరి కౌశల్ ఇలా, దీప్తి అలా, గీతామాధురి ఇంకోలా అంటూ.. చెత్తంతా మాట్లాడుకోవడం, బిగ్బాస్ నిర్వాహకులు దానిని టెలికాస్ట్ చేయడం చూసేవారికి చాలా ఇబ్బందికరంగా కూడా మారింది. బిగ్బాస్ అంటే టీవీ రియాలిటీషో. దీనిని చూసే వారిలో 70శాతం మంది గృహిణులు, పెద్దవాళ్లే. వారికి రీచ్ అవ్వాలంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వారు అవసరం. బిగ్బాస్ 2లో ఇదే ప్రధాన లోపంగా మారింది. పైగా.. ఈ నలుగురి దాడికి భయపడి.. మిగతా వారంతా ఎందుకొచ్చిన గొడవలే అనుకుని.. మౌనంగా ఎక్కడో మూలకు చేరి తమ పనేదో తమదన్నట్టుగా ఉండిపోతున్నారు. ఎంతసేపూ తేజస్వీ అరుపులు, కేకలు, ఇతరులపై అసహ్యమైన ట్రోలింగ్ చేయడం.. వంటివి చూడాలంటేనే ఆసక్తి దొబ్బిందంటూ.. సోషల్మీడియాలో వీక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ఒక్క తేజశ్వని బయటకు పంపిస్తే.. హౌస్ సెట్టయిపోతుందంటూ ప్రేక్షకులు వేల సంఖ్యలో కామెంట్లు పెడుతున్నారు. బిగ్బాస్ హౌస్లో బాబూ గోగినేని, గీతామాధురి, కౌశల్ ఈ ముగ్గురు ఉండడం వల్లే చూసేందుకు కొంత ఆసక్తి మిగిలి ఉంది. వీరూ బయటకొచ్చేస్తే.. ఇంక టీవీలు ఆపేయొచ్చని జోకులు పేలుతున్నాయి. హోస్ట్గా ఉన్న నానికి ఈ విషయం అర్థమై.. గ్రూపిజం వద్దంటూ సూచించాడు. అయితే.. అప్పటివరకూ సామ్రాట్, తేజస్వి, తనీష్ ముగ్గురు గ్రూపుగా ఉండేవారు.. నాని చెప్పిన తర్వాత దీప్తి సునయనాను కొత్తగా జట్టులో చేర్చుకుని గతంలో ముగ్గురుండే టీం ఇప్పుడు నలుగురిగా మారింది.
బిగ్బాస్లో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు, అలవాట్లు తెలుసుకోవచ్చని ఎక్కువ మంది చూస్తుంటారు. ఇప్పుడు ఈ నలుగురూ ఒక జట్టుగా మారి మిగతా వారిని బెంబేలెత్తిస్తుంటే.. మిగతావారంతా మౌనం దాల్చారు. ఇంకెక్కడ ఆసక్తి ఉంటుంది. అరుపులు, కేకలు, పెడబొబ్బలు తప్ప. తనిష్ ఎప్పుడు చూసినా ముఖం కందగడ్డలా పెట్టి యాంగ్రీబర్డ్స్లా ఘీంకరిస్తూనే ఉన్నాడు. తేజస్వి తనకు నచ్చని ఇంటి సభ్యులందరిపై ఏదో ఒకటి కూర్చేసి వారి తప్పులను ఎత్తిచూపుతూ అందరి దగ్గరా చులకన చేస్తోంది. హౌస్లో తేజస్విని కంటే తప్పులు, లూజ్ ఠంగ్ ఇంకెవరూ లేరు. ఇంక సామ్రాట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎంతసేపు తేజస్వి ఒడిలోనో, కౌగిలిలోనో, భుజంపైనో తల వాల్చడం తప్ప ఇంకేం చేయడం లేదు. తేజస్వి, తనీష్ ఏదంటే.. దానికి తల ఊపుతూ.. ఓ ఉత్సవ విగ్రహంలా మారాడు. జట్టుకు మాత్రం బలం చేకూరుస్తున్నాడు. ఇంక దీప్తి సునయన చెప్పే మాటలు, చేసే చేష్టలు చూసేందుకే కంపరమెత్తిస్తున్నాయి. కేవలం ఉదయం వచ్చే పాటకు నాలుగు స్టెప్పులు.. అవికూడా పాచిపట్టిపోయినవే.. వేస్తూ.. ఇంక మిగతా రోజంతా తనీష్ వెంట హచ్డాగ్లా తిరుగుతోంది. ఎవరినైనా వేధించాలన్నా.. టార్గెట్ చేయాలన్నా.. ఈ నలుగురూ ఒక్కటైపోతుంటారు.
అందుకే మొదటి వారం నుంచి కౌశల్, గీతామాధురి లాంటి వారు తరచూ బయటకు వెళ్లేవారి జాబితాలో నామినేట్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే అమిత్ తివారీ, భానుశ్రీ లాంటి కంటెస్టెంట్ల మాదిరిగా తేజస్వీ గ్రూప్ చుట్టూ చేరి వీరిద్దరూ భజన చేయడం లేదు. వాళ్లు ఏం చెప్పినా.. విని తల ఊపడం లేదు.. అందుకే తేజస్వి తెగ టార్గెట్ చేస్తోంది. కాకపోతే బిగ్బాస్ నిర్వాహకులు చెప్పినట్టు హౌస్లో ఉన్నవాళ్ల జుట్టు ప్రేక్షకుల చేతిలో ఉండడంతో వాళ్లను ఏం చేయలేకపోతోంది. వీళ్ల నలుగురు ఎంత తెలివిగా ఆడుతున్నారంటే.. ఒక జట్టుగా మారిపోయి.. ఇంటిలోని మిగతా సభ్యుల్లో మరో నలుగురైదుగురిని ఒక్కక్కరూ ఒక్కొక్కరిని పట్టుకుని తమకు నచ్చని వారిపై లేనిపోని మాటలు చెప్పేస్తూ.. వాళ్ల దృష్టిలోనూ కౌశల్ లాంటి వాళ్లను విలన్లుగా మారుస్తున్నారు. షో.. అదన్నమాట.. బిగ్బాస్ హౌస్లో మరో బిగ్బాస్ను నడుపుతున్న తేజస్వి వ్యవహారం. అసలు బిగ్బాస్ అంటేనే.. ఎవరికి వారు ఒక్కొక్కరిగా ఆడాల్సిన ఆట. కానీ.. ఇలా జట్టుగా ఆడితే ఏం ఆసక్తి ఉంటుంది. బిగ్బాస్పై ఆసక్తిని పెంచేందుకు ఇలాంటి జట్లను విడగొట్టి బయటకు పంపిస్తారో.. లేక ఇలాగే పరమ బోరింగ్గా గొడవలతోనే చావమని వదిలేస్తారో చూద్దాం.