భారత మాజీ కెఫ్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి టీ20ల్లో బౌలింగ్ చేయడం చాలా కష్టమని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. కరోనా వైరస్ వల్ల ఇంట్లోనే ఉంటున్న అశ్విన్.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని టీ20ల్లో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టం ? అని ప్రశ్నించగా.. అశ్విన్ ఊహించని సమాధానం ఇచ్చాడు. ధోనీ కి టీ20ల్లో బౌలింగ్ చేయడం చాలా కష్టమని అన్సర్ ఇచ్చాడు.
దాంతో.. ‘‘ధోనీ గురించి కాస్త చెప్పండి’’ అని ఆ వెంటనే మరో ప్రశ్న అడిగాడు. “టీ20లో మహేంద్రసింగ్ ధోనీ గొప్ప బ్యాట్స్మెన్. టీ20ల్లో ధోనీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధోనీకి బౌలింగ్ చేయడం మరి కష్టం. ఇక ధోనీ గురించి అంటారా..? భారత్ ఇప్పటి వరకూ చూడని గొప్ప కెప్టెన్ ధోని. అలానే ఐపీఎల్లోనూ అదే స్థాయిని అతను అందుకున్నాడు’’ అని అశ్విన్ వెల్లడించాడు. భారత్కి 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ధోనీ.. ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అలానే ఐపీఎల్లోనూ చెన్నై టీమ్కి కెప్టెన్గా ధోనీ మూడు టైటిల్స్ని అందించాడు. ఇక ధోనీ కెఫ్టెన్సీలో సుదీర్ఘకాలం భారత్ తరపున ఆడిన అశ్విన్.. ఐపీఎల్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాడు. అయితే ఐపీఎల్ 2020 సీజన్ కోసం అశ్విన్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కి మారాడు. కానీ కరోనా కారణంగా ఈ సంవత్సరం జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడింది.