ఆసియా కప్లో భారత్ బౌలర్లు మరోసారి పాకిస్థాన్పై సత్తాచాటారు. దుబాయ్ వేదికగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా (2/29), కుల్దీప్ యాదవ్ (2/41), చాహల్ (2/46) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.
ఆ జట్టులో షోయబ్ మాలిక్ (78: 90 బంతుల్లో 4×4, 2×6) అర్ధశతకంతో మెరిసినా.. మిగిలిన బ్యాట్స్మెన్స్ నిరాశపరచడంతో పాక్ మరోసారి తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత బుధవారం భారత్తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 162 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాక్ను భారత స్పిన్నర్లు చహల్, కుల్దీప్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. 55 పరుగులకే ఇమామ్ ఉల్ హక్(10), ఫకార్ జమాన్(31)లను పెవిలియన్కు చేర్చారు. ఆ వెంటనే బాబర్ ఆజమ్(9) సమన్వయలోపంతో రనౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో 58 పరుగులకే పాక్ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టల్లో పడింది.
ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన మాలిక్, సర్ఫరాజ్లు ఆచితూచి ఆడుతూ పాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఈ క్రమంలో 64 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో మాలిక్ హాఫ్ సెంచరీ సాధించాడు.జట్టు స్కోరు 165 వద్ద కుల్దీప్ బౌలింగ్లో సర్ఫరాజ్ ఔటవడంతో శతక భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రమంగా మాలిక్ జోరు తగ్గించాడు. కానీ.. సర్ఫరాజ్ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆసిఫ్ అలీ (30: 21 బంతుల్లో 1×4, 2×6) మాత్రం భారీ షాట్లతో చెలరేగాడు. ముఖ్యంగా.. భువనేశ్వర్ వేసిన ఓ ఓవర్లో రెండు సిక్సర్లు బాదేశాడు. ప్రమాదకరంగా మారిన అలీని చాహల్ పెవిలియన్ బాట పట్టించగా.. మాలిక్ను బుమ్రా బోల్తా కొట్టించాడు. దీంతో.. ఒత్తిడిలో పడిన పాక్ ఆ తర్వాత చివరి వరకూ పుంజుకోలేకపోయింది.