దుబాయ్ వేదికగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆసియా కప్ సమరం నేటినుంచి ప్రారంభం కానుంది. కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా రోహిత్ శర్మ కెప్టెన్గా పగ్గాలు చేపట్టారు. 14వ సారి (గతంలో 12 సార్లు వన్డే, ఒకసారి టి20) నిర్వహిస్తున్న ఈ కప్ తొలి మ్యాచ్లో శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడనుంది. ఆరు సార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా తొలి మ్యాచ్ను అబుదాబిలో ఈ నెల 18న క్వాలిఫయర్ హాంకాంగ్తో ఆడనుంది. ఆ మరుసటి రోజే దాయాది పాకిస్తాన్తో కీలక సమరంలో రోహిత్ శర్మ బృందం అమీతుమీ తేల్చుకోనుంది.
8 నెలల్లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ కోసం మెరుగ్గా సన్నద్ధం కావాలని యోచిస్తోంది. ఇప్పటి వరకూ 12 సార్లు ఆసియా కప్ను నిర్వహించగా.. క్రితం సారి మాత్రమే టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. ఈసారి మళ్లీ వన్డే ఫార్మాట్లో ఆరు దేశాలు ఆసియా కప్లో తలపడనున్నాయి.
ఎంతకాలంగానో అస్థిరంగా ఉన్న మిడిలార్డర్ సమస్యను పరిష్కరించుకునేందుకు, ప్రపంచ కప్ కూర్పుపై అంచనాకు వచ్చేందుకు మన జట్టుకు ఈ టోర్నీ ఓ అవకాశంగా నిలవనుంది. తద్వారా మాజీ కెప్టెన్ ధోని ఏ స్థానంలో బ్యాటింగ్కు రావాలన్న విషయమూ స్పష్టమవుతుంది.
భారత్, పాక్ల మధ్య పోరు టోర్నీకే హైలెట్గా నిలవనుంది. ఇరు జట్లు బుధవారం ముఖాముఖి తలపడనున్నాయి. అంతకు ముందు రోజు భారత్.. హాంకాంగ్తో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో ఓడిన టీమిండియా.. ఈసారి ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
టోర్నీలో జట్లను పూల్ ‘ఎ’ (భారత్, పాకిస్తాన్, హాంకాంగ్), పూల్ ‘బి’ (శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్)గా వర్గీకరించారు. తమ గ్రూపుల్లో 1, 2 స్థానాల్లో నిలిచిన జట్లే సూపర్ ఫోర్ దశలో ఆడాల్సి ఉంటుంది. దీని ప్రకారం భారత్, పాక్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఎదురుపడే అవకాశం ఉంది. సంచలనాలేమీ లేకుంటే ఫైనల్లోనూ ఈ రెండు జట్లే అమీతుమీ తేల్చుకునేందుకు బరిలో దిగొచ్చు. స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.