విశ్వవేదికపై తిరుగులేని ప్రదర్శన కనబరుస్తున్న కంగారూలు ఆరు మ్యాచ్ల్లో ఐదింట గెలిచి సెమీఫైనల్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకున్నారు. విజయాలతో దూసుకుపోతున్న ఆసిస్కు బంగ్లా పులులు ముచ్చెమటలు పట్టించారు. డిఫెండింగ్ చాంపియన్, అన్ని రంగాల్లో తనకంటే బలమైన ఆస్ట్రేలియాపై గెలిచేంత పనిచేసింది. ప్రపంచకప్లో భాగంగా ఆసీస్తో జరిగిన మ్యాచ్లో బంగ్లా 48 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
ఆసీస్ నిర్దేశించిన 382 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఆటగాళ్లలో ముష్పీకర్ రహీమ్(102 నాటౌట్; 97 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సర్) అసాధరణ రీతిలో సెంచరీతో పోరాడగా.. తమీమ్(62), మహ్మదుల్లా(69)లు అర్దసెంచరీలు సాధించారు. సీనియర్ ఆటగాడు షకీబ్(41), లిట్టన్ దాస్(20) భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్నైల్, స్టొయినిస్, స్టార్క్లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జంపా ఒక్క వికెట్ దక్కించుకున్నారు
అంతకుముందు మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు వార్నర్ వీర బాదుడుతో భారీ స్కోరు చేసింది. 147 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 14 ఫోర్లు, 5 సిక్సర్లతో 166 పరుగులు చేశాడు. కెప్టెన్ ఫించ్ 53, ఉస్మాన్ ఖావాజా 89 పరుగులు చేశారు. చివరల్లో మ్యాక్స్వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది.ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో పది పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానికి చేరుకుంది.