వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లండ్తో జరగనున్న మ్యాచ్లో భారత క్రికెట్ ఆటగాళ్లు ధరించే జెర్సీ రంగు మారింది. ధరించనుంది. కనీసం రెండు రంగుల జెర్సీలను తమ వెంట తెచ్చుకోవాలని ఐసీసీ అన్ని దేశాలను కోరింది. అందులో భాగంగానే టీమిండియా రెండు జెర్సీలతో ఇంగ్లండ్ వెళ్లింది. ఇప్పటివరకూ ‘మెన్ ఇన్ బ్లూ’గా గుర్తింపు తెచ్చుకున్న జట్టు, ‘మెన్ ఇన్ శాఫ్రాన్’గా మారనుంది. జర్సీ రంగుపై రాజకీయ వివాదం చోటు చేసుకుంది.
జర్సీ రంగులో కాషాయాన్ని చొప్పించడం వెనుక మోదీ ప్రభుత్వ ఒత్తిడి ఉందని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దేశం మొత్తాన్ని కాషాయికరణ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్రకు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ ఆరోపించారు.
జెర్సీలకు మరో రంగు ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే, మూడు రంగులను ఎంచుకుని ఉండాల్సిందని, అప్పుడు ఎవరికీ అభ్యంతరం ఉండదని సూచించారు. ఈ వాదనను వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్, జెర్సీ రంగుపై రాజకీయం ఎందుకని ప్రశ్నించారు.కాషాయ రంగును ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఆరెంజ్ జెర్సీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి గులాబ్రావ్ పాటిల్ అన్నారు.
ఇంగ్లండ్ జట్టు కూడా బ్లూ కలర్ జర్సీలను ధరిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇలా రెండు జట్లూ ఒకే రంగు దుస్తులతో ఆడితే అయోమయం ఉంటుందన్న ఉద్దేశంతో, టోర్నీ ప్రారంభానికి ముందే ప్రతి జట్టూ రెండు రంగుల జెర్సీలను తమ వెంట తెచ్చుకోవాలని అన్ని దేశాలను కోరింది. అందులో భాగంగానే భారత జట్టు రెండు జెర్సీలను ఇంగ్లండ్ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.