ప్రపంచకప్లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ టోర్నీ నుంచి పూర్తిగా వైదొలిగాడు. తొలుత మూడు మ్యాచులకు దూరమంటూ వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం మొత్తం టోర్నీ నుంచే ధావన్ దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. నేపథ్యంలో గబ్బర్ స్థానంలో రిషబ్ పంత్ను అధికారికంగా తుదిజట్టుకు ఎంపిక చేశారు. పంత్ ఎంపికను బీసీసీఐ..ఐసీసీకి తెలిపింది. పంత్ ఇప్పటికే ఇంగ్లాండ్కు వచ్చి జట్టుతో పాటు సాధన చేస్తున్నాడు.
ఐసీసీ మెగా టోర్నీల్లో ధావన్కు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. దీంతో అతడి సేవలను కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని, 10-12 రోజుల తర్వాత అతడు గాయం నుంచి కోలుకుంటున్న విధానాన్ని సమీక్షిస్తామని టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే గాయం తగ్గడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండటంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న పంత్ సాధన చేస్తున్నాడు.
ఈనెల 9న ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కౌల్టర్ నైల్ వేసిన షార్ట్ పిచ్ బంతి ధావన్ బొటన వేలికి బలంగా తాకింది. ప్రాథమిక చికిత్స తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు. తర్వాత స్కానింగ్ చేయగా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించి, విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. ధావన్ గాయంపై వైద్య పరీక్షలు నిర్వహించగా ఇప్పట్లో తగ్గి పూర్తి ఫిట్ నెస్ తో మైదానంలోకి దిగే అవకాశం లేదని బీసీసీఐ వైద్యులు పేర్కొన్నారు.