టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అధ్భుతమైన ఫామ్ తో పలు రికార్డులను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెస్టుల్లో 20 సెంచరీలను పూర్తి చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో కోహ్లీ 20వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తాజాగా ఈరికార్డును ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ అధిగమించాడు.
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్-ఆసీస్ మధ్య ఈ రోజు నాలుగో టెస్టు బాక్సింగ్ డే టెస్టు ప్రారంభమైంది. మెల్బోర్న్లో జరుగుతోన్న ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓపెనర్లు బాన్క్రాఫ్ట్-డేవిడ్ వార్నర్ ఆసీస్కు శుభారంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 34.3 వద్ద వోక్స్ వేసిన బంతికి బాన్క్రాఫ్ట్(26) ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 103(151 బంతుల్లో, 13×4, 16) పరుగుల వద్ద అండర్సన్ బౌలింగ్లో బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చాడు. తాజా శతకంతో వార్నర్ తన టెస్టు కెరీర్లో 21వ శతకాన్ని నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్లో ఇప్పటి వరకు 20శతకాలు ఉన్నాయి.
అంతేకాదు వార్నర్ టెస్టుల్లో 6వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఆసీస్ తరఫున 6వేలకు పైగా పరుగులు సాధించిన వారిలో వార్నర్ 14వ వాడు. ఈ ఏడాది వార్నర్కి ఇది నాలుగో శతకం. గతంలో బంగ్లాదేశ్పై రెండు, పాక్పై ఒక శతకం సాధించాడు. దీంతో వార్నర్ టెస్టుల్లో 20కి పైగా శతకాలు సాధించిన ఆసీస్ క్రికెటర్ల జాబితాలో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్ 41 శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ల యాషెస్ సిరీస్ను ఆసీస్ ఇప్పటికే 3-0తో దక్కించుకున్న సంగతి తెలిసిందే.