టీమిండియా మాజీ కెఫ్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్లో కచ్చితంగా ఆడతారని వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో అన్నారు. ఈ ఏడాది జులైలో వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు ధోని దూరంగా ఉంటున్నాడు. దాంతో అతను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ధోనీ కూడా ఈ వార్తలపై పెదవి విప్పలేదు.
తాజాగా ధోనీ గురించి బ్రావో మాట్లాడుతూ.. “ధోనీ ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న టీ20 ప్రపంచకప్లో కచ్చితంగా ఆడతాడు. క్రికెట్ వెలుపలి అంశాలకి చింతిచొద్దు.. నీ సామర్థ్యాల్ని నమ్ముకో అని ధోనీ తరచూ టీమ్ సభ్యులతో చెప్తుంటాడు. తాను కూడా క్రికెటేతర అంశాల గురించి ఎప్పుడూ ఆలోచించడు’ అని డ్వేన్ బ్రావో వెల్లడించాడు.
గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన డ్వేన్ బ్రావో మళ్లీ ఆ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో మాత్రమే ఆడతానని బ్రావో తెలిపాడు.