ప్రపంచకప్లో పేవల ప్రదర్శనతో ధోనిపై రిటైర్మెంట్ తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతోంది. మరో వైపు మరికొంత మంది ఇకొంత కాలం ధోని జట్టులో కొనసాగాలని సూచిస్తున్నారు. తాజాగా మిస్టర్ కూల్పై బీసీసీఐ మాజీ సెలెక్టర్ సంజయ్ జగ్దాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వప్రయోజనాల కన్నా దేశం కోసమే ధోనీ ఎల్లప్పుడూ ఆడాడని, అతడికి తగ్గ ప్రత్యామ్నాయ ఆటగాడు టీమిండియాలో మరొకరు లేరని కితాబిచ్చారు.
త్వరలో జరగనున్న వెస్టిండీస్ టూర్ కు ధోనిని ఎంపిక చేస్తారా? లేదా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంజయ్ జగ్దాలే కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి . ఒక వికెట్ కీపర్గా, బ్యాట్స్మన్గా అతడితో వేరొక ఆటగాడు సరితూగలేడని తెలిపాడు. ధోనీ భవితవ్యంపై వస్తోన్న వార్తలతో పాటు ప్రపంచకప్లో అతడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే ఆరోపణల నేపథ్యంలో మాజీ సెలెక్టర్ ధోనీకి అండగా నిలిచాడు. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ నుంచి ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకునే మెచ్యూరిటీ ధోనీకి ఉందని తెలిపారు.
సచిన్ రిటైర్మెంట్ ప్రకటించేముందు..సెలెక్టర్లు ఒకసారి అతడిని సంప్రదించిన మాదిరిగానే ఇప్పుడు ధోనీ మనసులో ఏముందో తెలుసుకోవాలని కోరాడు. అలాగే తాము అతడి నుంచి ఏం ఆశిస్తున్నామో కూడా తెలియజేయాలని సూచించాడు.