టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ… ఇద్దరిలో బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? అంటే సమాధానం చెప్పడం కాస్త కష్టమే. ఒకరేమో రన్ మెషిన్.. మరోకరు సిక్సుల వీరుడు. ఈ ప్రశ్న ఎవరిని అడిగినా ఆన్సర్ చెప్పడం కష్టమే. ఇదే ప్రశ్న భజ్జీని అడిగామనుకోండి.. ఆయన ఇచ్చే సమాధానం ఇలా ఉంటుంది.
‘చాలా కష్టమైన ప్రశ్న. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాళ్లు. ఇద్దరూ మ్యాచ్ను గెలిపించే వాళ్లే. ఇద్దరూ క్లాస్ ప్లేయర్లు. వాళ్లేంటో వారు సాధించిన రికార్డులే చెబుతాయి. రోహిత్ అద్భుతమైన ప్రతిభావంతుడు. కోహ్లీ కష్టపడే ఆటగాడు. రోహిత్లాగా కోహ్లీకి టాలెంట్ లేకపోవచ్చు. కానీ హార్డ్ వర్క్, ఆటపట్ల అతడికున్న అభిరుచే కోహ్లీని నడిపిస్తున్నాయి. కాబట్టి ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనేది చెప్పడం కష్టం. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం నా వల్ల కాదు. ఇద్దరూ ఇండియా కోసమే ఆడుతున్నారు. జట్టు విజయానికి ఎంతో కృషి చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చాడు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గానూ రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. మొత్తంగా 2,288 పరుగులతో రోహిత్ టాప్లో ఉండగా.. విరాట్ కోహ్లీ 2,167 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్మెన్..? అని హర్భజన్ సింగ్ని ప్రశ్నించగా.. పైన చెప్పినట్టు చాలా తెలివిగా సమాధానమిచ్చాడు.
రోహిత్ శర్మ టీ20ల్లో ఇప్పటికే 20సార్లు 50+ స్కోరు చేయగా.. ఇందులో 4 శతకాలు, 16 అర్ధశతకాలు ఉన్నాయి. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ కనీసం ఒక్క శతకం కూడా సాధించలేదు. ఈ గణాంకాలు ఆధారంగా చెప్తారా..? అని ప్రశ్నించగా.. ‘రోహిత్ శర్మ ఓపెనర్గా ఆడుతున్నాడు. కాబట్టి.. అతనికి ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.. సెంచరీలు సాధించగలడు. కానీ.. విరాట్ కోహ్లీ.. భారత్ జట్టు వికెట్లు కోల్పోతోనే క్రీజులోకి వస్తాడు. వెంటనే బ్యాట్ ఝళిపించడానికి అవకాశం ఉండదు. ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. ఈ కారణంగా.. స్లాగ్ ఓవర్ల వరకూ బ్యాట్ ఝళిపించే ఛాన్స్ అతనికి ఉండదు. అందుకే ఈ గణాంకాల ఆధారంగా కూడా చెప్పలేను’ అని భజ్జీ వెల్లడించాడు.