ప్రపంచకప్లో పాకిస్థాన్పై ఓటమి ఎరుగని జట్టుగా భారత్ అవతరించింది. అభిమానులు ఒళ్లంతా కండ్లు చేసుకుని చూసిన మెగాటోర్నీలో మనోళ్లు పాక్ను పాతరేశారు. శతకోటి భారతావని మది విజయగర్వంతో ఉప్పొంగిపోయింది. మాతో పెట్టుకుంటే మసే అన్న రీతిలో కోహ్లీసేన చూపించిన పరాక్రమం..క్రికెట్ బతికున్నంతకాలం ప్రతిఒక్కరికి గుర్తుండిపోతుంది. ప్రతి బంతికి తమ పరాక్రమాన్ని చూపించిన మన ఆటగాళ్లు ఒంటి చత్తో విజయం అందించారు. యుద్ధంలా సాగిన మ్యాచ్లో ప్రత్యర్థి పాక్ను మట్టికరిపించింది.
మాంచెస్టర్ వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాక్ను మట్టి కరిపించింది భారత్. 1992 నుంచి వరల్డ్ కప్ టోర్నీలో భారత్ను ఓడించాలనే పాకిస్థాన్ కోరిక 2019లో సైతం కలగానే మిగిలిపోయింది. మొదట టాస్ గెలిచిన పాక్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఆదివారం పాక్తో జరిగిన మ్యాచ్లో 89 పరుగుల(డక్వర్త్ లూయిస్)తేడాతో కోహ్లి సేన ఘన విజయం సాధించింది.
తొలుత హిట్మ్యాన్ రోహిత్శర్మ (113 బంతుల్లో 140; 14ఫోర్లు, 3సిక్స్లు) సూపర్ సెంచరీకి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ (65 బంతుల్లో 77, 7 ఫోర్లు), రాహుల్ (78 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2సిక్స్లు) అర్ధసెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో 336/5 భారీ స్కోరు చేసింది. పాక్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ రాహుల్, రోహిత్ నిర్మించిన పటిష్ఠమైన ఇన్నింగ్స్ను కోహ్లీ మరోస్థాయికి తీసుకెళ్లాడు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్కు 3 వికెట్లు దక్కాయి.
లక్ష్య ఛేదనలో కుల్దీప్ (2/32), పాండ్యా (2/44), శంకర్ (2/22) ధాటికి పాకిస్థాన్ 34.4 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302గా సవరించారు. అప్పటికే పాక్ ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఫఖర్ జమాన్ (75 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (48; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. రోహిత్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. భారత బౌలర్లలో కుల్దీప్ (2/32), పాండ్యా (2/44), శంకర్ (2/22) వికెట్లు సాధించారు.
చక్కటి బంతులతో దడ పుట్టించిన భువనేశ్వర్ ఐదో ఓవర్లో కండరాలు పట్టేయడంతో ఓవర్ పూర్తి చేయకుండానే మైదానం నుంచి బయటకు వెళ్లాడు. దీంతో మిగిలిన రెండు బంతులు వేసేందుకు వచ్చిన విజయ్ శంకర్ తొలి బాల్కే ఇమాముల్ హక్ (7)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని భారత శిబిరంలో ఆనందం నింపాడు.