ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్ కు దూసుకెల్లింది. అయితే ఈ మ్యాచ్లో ఓ బామ్మ మెరుపు తీగలా మెరిసిపోయింది. ఆమె హుషారు చూసి యావత్తు సోషల్ మీడియా ఆమెకు ఫిదా అయిపోయింది. నోటితో బూర ఊదుతూ కుర్ర అభిమానులతో కలిసి కేరింతలు కొడుతున్న ఈ బామ్మ క్షణాల్లో వైరల్గా మారింది. ఆమె క్రికెట్ వరల్డ్ కప్ 2019కే హైలైట్ అయ్యింది.
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్లో ప్రత్యక్షమైన ఓ టీమిండియా ఫ్యాన్.. మ్యాచ్ మొత్తాన్ని తనవైపు తిప్పేసుకుంది. మైదానంలో ఉన్న క్రికెటర్లు కూడా ఆమె జోష్ను చూసి మురిసిపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆమె ఏ స్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందో. ఆమె పేరు.. చారులత పటేల్, గుజరాత్కు చెందిన వృద్ధురాలు. ఆటపై మక్కువ ఉంటే వయసుతో సంబంధంలేదని ఈ బామ్మ నిరూపించింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చిన్నపిల్లలకు ఏమాత్రం తగ్గకుండా బూర ఊదుతూ ఆమె చూపించిన జోష్కు అటు ఆటగాళ్లు, ఇటు కామెంటేటర్లు ఫిదా అయ్యారు.
మనోళ్లు ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే.. ఈలలు వేసింది, డ్యాన్సులు చేసింది, నినాదాలతో హోరెత్తించింది. ఆమెను చూసిన రోహిత్ శర్మ కూడా రెచ్చిపోయాడు. సిక్సులు, ఫోర్లు కొడుతూ ఆమెతో పాటు, ఫ్యాన్స్ను అలరించాడు. సెంచరీతో కదం తొక్కాడు. మ్యాచ్ ముగిశాక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వెళ్లి ఆమెను కలిసి, ముచ్చటించారు. వారితో మాట్లాడుతుంటే ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారిని హృదయానికి హత్తుకున్న చారులత.. ముద్దిచ్చి, ఆశీర్వదించింది.
చారులతను కలిసిన ఫొటోలను కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా, ఐసీసీ వీడియోను పోస్టు చేసింది. తమకు మద్దతు పలికిన ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్పై ఆమెకున్న అభిరుచి, అంకితభావానికి సెల్యూట్ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. తానెప్పుడూ ఇలాంటి అభిమానిని చూడలేదన్నాడు. వయసు అనేది ఒక నంబరు మాత్రమేనని, అభిరుచి హద్దులను చెరిపేస్తుందని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ఈ బామ్మపై ప్రశంసల వర్షం కురిపించారు అభిమానులు.
క్రికెట్పై బామ్మకు ఉన్న అభిమానానికి బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా కూడా ముగ్ధులయ్యారు. అప్పటి వరకు మ్యాచ్ లైవ్ చూడని బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను చూడ్డానికే టీవీ ఆన్ చేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆమెకు టికెట్ స్పాన్సర్ చేయొచ్చుగా అని ఓ నెటిజన్ ఆయన్ను ప్రశ్నించగా.. ‘ఆమె ఎక్కడుంటారో కనుక్కోండి.. ఇకనుంచి భారత్ ఆడే మ్యాచ్లన్నింటికీ టికెట్ స్పాన్సర్ చేస్తా’నని వెల్లడించారు.