సఫారీలతో మొహాలీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది .అనంతరం భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (52 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించారు.
ఈ మ్యాచ్ లో హార్థిక్ పాండ్యాపై రోహిత్ శర్మ సీరియస్ అయ్యారు. ఫాస్ట్ బౌలర్ హార్దిక్ పాండ్య పదే పదే ఆఫ్ స్టంప్కి వెలుపలగా బంతులేస్తూ బౌండరీలు ఇస్తుండటంతో ఒకానొక దశలో సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. వేలు చూపిస్తూ మరీ ఆ బంతులు వేయకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంగాన్లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండటంతో.. ధోనీ తరహాలో ఫీల్డింగ్ మార్పులు చేస్తూ కనిపించిన రోహిత్ శర్మ.. హార్దిక్కి బౌలింగ్ సూచనలు చేశాడు.ఇన్నింగ్స్ 10వ ఓవర్ బౌలింగ్కి వచ్చిన హార్దిక్ పాండ్య.. ఆ ఓవర్ నాలుగో బంతిని ఆఫ్ స్టంప్కి వెలుపగా వైడ్ రూపంలో విసిరాడు. దీంతో సఫారీ బ్యాట్స్ మెన్ బవుమా సులభంగా బాల్ ను బౌండరికి తరలించారు.ఆ తర్వాత బంతిని కూడా హార్దిక్ పాండ్య అదే తరహాలో విసరగా.. బవుమా పాయింట్ దిశగా మళ్లీ ఫోర్ కొట్టాడు. దీంతో రోహిత్ సీరియస్ అవ్వడంతో తన బౌలింగ్ తప్పిదాన్ని దిద్దుకుని పొదుపుగా బౌలింగ్ చేశాడు. అదే సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లీ చూస్తుండిపోయాడు.