జాతీయ జట్టులో యువ క్రికెటర్లు చోటు సంపాదించడమంటే మామూలు విషయం కాదు. విపరీతమైన పోటీ ఉంటుంది. ఒక వేల చోటు దక్కించుకున్నా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి లేకుంటే వారి భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. ఇప్పుడు యువ క్రికెటర్ రిషబ్ పంత్ పరిస్థితి ఇలాగే ఉంది. ధోని వారసుడిగా జట్టులోకి వచ్చిన పంత్ చేజేతులారా తన కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారు. వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకోకుండా వాటన్నింటిని దూరం చేసుకుంటున్నారు. కెప్టెన్ కోహ్లీ, కోచ్ ఎన్నిసార్లు హెచ్చరించినా పంత్ లో మాత్రం మార్పురావడంలేదు.
దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో పేలవ షాట్ సెలక్షన్తో మరోసారి ఔటైన రిషబ్ పంత్ పై విమర్శలు ఎక్కువవుతున్నాయి. వెస్టిండీస్ పర్యటనలో పేలవంగా వికెట్ చేజార్చుకున్న ఈ యువ వికెట్ కీపర్కి సఫారీలతో సిరీస్ కు మరో అవకాశం ఇచ్చారు. కాని ఆ వకాశాన్ని కూడా పంత్ చేజార్చుకున్నారు.
దీంతో జట్టులో అతని స్థానం ప్రశ్నార్థకంగా మారుతోంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రాత్రి బెంగళూరు వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.భారత జట్టులో పోటీ ఎక్కువైంది. ఈ సమయంలో అతను మరింత జాగ్రత్తగా ఆడాలి. కానీ.. తనకెంతో ఇష్టమైన టీ20లోనూ పంత్ తేలిపోతున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడో టీ20లోనూ రిషబ్ పంత్ ఫెయిలైతే.. అతని స్థానంలో తర్వాత సిరీస్కి సంజు శాంసన్ లేదా ఇషాన్ కిషన్ని తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారు`.