దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్లో భాగంగా టీమిండియా శుభారంభం చేసింది. మొహాలిలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో సఫారీలను కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. తొలి టీ20 వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్ ల సిరీస్లో కో హ్లీసేన 1-0తో ముందడుగు వేసింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో ఓవర్ మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(52 బంతుల్లో 72 నాటౌట్, 4ఫోర్లు, 3సిక్స్లు) అజేయ అర్ధసెంచరీతో కదంతొక్కాడంతో భారత్ ఘనవిజయం సాధించింది.
మొదట టాస్ గెలిచి సఫారీలను కోహ్లీసేన బ్యాటింగ్ కు ఆహ్వానించింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కెప్టెన్ డి కాక్ (37 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా… బవుమా (43 బంతుల్లో 49; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు.రెండో వికెట్కు 45 బంతుల్లో 57 పరుగులు… డి కాక్, బవుమా మధ్య సాగిన ఈ భాగస్వామ్యం మినహా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో చెప్పుకోవడానికేమీ లేదు.పవర్ప్లేలో దక్షిణాఫ్రికా 39 పరుగులు చేయగలిగింది. ఆరు బంతుల వ్యవధిలో డి కాక్, వాన్ డర్ డసెన్ (1) డగౌట్ చేరడంతో సఫారీ జట్టు భారీ స్కోరు ఆశలకు కళ్లెం పడింది.దీపక్ చహర్కు 2 వికెట్లు దక్కాయి.
150 పరుగుల చేధనకు దిగిన కోహ్లీసేన 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పపరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 52 బంతుల్లో 72 నాటౌట్(4ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా, ఓపెనర్ శిఖర్ ధవన్(40; 31 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్) తన బ్యాట్కు పని చెప్పాడు.భారత బ్యాటింగ్లో రోహిత్ (12), రిషబ్ పంత్ నిరాశపరిచారు.వీరిద్దరి తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కోహ్లీకి జతగా నిలిచాడు. మరోవైపు, కోహ్లీ దూకుడుగా ఆడి 72 పరుగులు చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.