వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత్ జట్టుకి ఉగ్ర ముప్పు ఉందన్న సమాచారంతో బీసీసీఐ ఆటగాళ్లకి భద్రతని పెంచేలా చర్యలు తీసుకుంది. విండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్ల కదలికల్ని ఎప్పటికప్పుడూ ఫాలో అవుతున్నామని, ఆటగాళ్లు ప్రమాదంలో ఉన్నారంటూ బీసీసీఐకి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆంటిగ్వాలోని భారత హైకమిషన్కు సమాచారమిచ్చినట్లు సమాచారం. దీంతో .. టీమిండియాకి భద్రతని పెంచిన ఆంటిగ్వా ప్రభుత్వం.. మరో పైలైట్ వాహనాన్ని కూడా సమకూర్చింది.
విండీస్ పర్యటనలో ఇప్పటికే మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడిన భారత్ జట్టు.. రెండు సిరీస్ల్లోనూ ఆతిథ్య జట్టుని క్లీన్స్వీప్ చేసేసింది. ఇక గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది.టూర్లో మహేంద్రసింగ్ ధోనీ మినహా.. అందరూ అగ్రశ్రేణి ఆటగాళ్లూ ఉండటంతో.. భద్రతపై బీసీసీఐ ఆగమేఘాల మీద సమీక్షలు జరిపింది.
మొదట పీసీబీకి ఆ మెయిల్ వచ్చిందని, దాన్ని ఐసీసీతో బీసీసీఐకి వారు పంపినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ తగిన జాగ్రత్తలు తీసుకుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారి చెప్పుకొచ్చారు. అక్కడి పరిస్థితులపై ప్రత్యేక నిఘా ఉందని, అవసరమైతే మరింత భద్రత పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.