వెస్టిండీస్తో కింగ్స్టన్లో జరుగుతున్న రెండవ టెస్టు తొలి రోజు భారత్ ఆట ముగిసే సమయానికి అయిదు వికెట్ల నష్టానికి 264 పరుగుల గౌరవ ప్రదమైన రన్స్ సాధించింది. విండీస్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు వేస్తున్నా బ్యాట్స్ మెన్ లు సమయోచితంగా పోరాడారు. కెప్టెన్ కోహ్లీ (76: 163 బంతుల్లో 10×4) మరో సారి అర్థ శతకం సాధించి జట్టును ఆదుకున్నాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (127 బంతుల్లో 55; 7 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ సాధించాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలిరోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి 264/5తో మెరుగైన స్థితిలో నిలవగా.. ప్రస్తుతం క్రీజులో హనుమ విహారి (42 నాటౌట్: 80 బంతుల్లో 8×4), రిషబ్ పంత్ (27 నాటౌట్: 64 బంతుల్లో 2×4, 1×6) ఉన్నారు.ఇక మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్(13), పుజారా(6), తొలి మ్యాచ్లో సెంచరీ హీరో అజింక్య రహానే(24)లు పూర్తిగా నిరుత్సాహపరిచారు.
విండీస్ కెప్టెన్ హోల్డర్కు 3 వికెట్లు పడగొట్టగా… రకీమ్ కార్న్వాల్, కీమర్ రోచ్ చెరో వికెట్ తీశారు. భారత జట్టు ఎలాంటి మార్పులు చేయకుండా తొలి టెస్టులో నెగ్గిన జట్టునే కొనసాగించింది. దాంతో వరుసగా రెండో మ్యాచ్లోనూ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కలేదు. పరిమిత ఓవర్ల జట్టులో లేని అశ్విన్…రెండు టెస్టుల కోసమే విండీస్కు వచ్చాడు. ఇప్పుడు అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే స్వదేశం తిరిగి రానున్నాడు.