వరల్డ్ కప్ తర్వాత వెస్డీండీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత్ విజయ దుంధుబి మోగిస్తోంది. టీ20 సిరీస్ ను క్లీన్ స్విప్ చేసి కోహ్లీసేన వన్డేసిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా బుధవారం అర్ధరాత్రి ముగిసిన మూడో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి (114 నాటౌట్: 99 బంతుల్లో 14×4) అజేయ శతకం బాదడంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. శ్రేయాస్ అయ్యర్ (65: 41 బంతుల్లో 3×4, 5×6) కూడా కోహ్లికి మంచి సపోర్ట్ అందించాడు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ పవర్ ప్లే ఓవర్స్లో భారత బౌలర్స్కి చుక్కలు చూపించింది. ఆ జట్టు ఓపెనర్లు క్రిస్గేల్ (72: 41 బంతుల్లో 8×4, 5×6), ఎవిన్ లావిస్ (43: 29 బంతుల్లో 5×4, 3×6) తొలి వికెట్కి 10.5 ఓవర్లలోనే 115 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చారు.
ఓవర్ వ్యవధిలోనే ఈ ఇద్దరూ పెవిలియన్కి చేరిపోగా.. మిడిలార్డర్లో నికోలస్ పూరన్ (30: 16 బంతుల్లో 1×4, 3×6) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. మ్యాచ్కి ఆరంభంలోనే అంతరాయం కలిగించిన వరుణుడు.. విండీస్ ఇన్నింగ్స్లో 22 ఓవర్లు ముగిసిన సమయంలో మళ్లీ అడ్డుపడ్డాడు. దీంతో.. మ్యాచ్ని 35 ఓవర్లకి అంపైర్లు కుదించగా.. వెస్టిండీస్ 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు, మహ్మద్ షమీ రెండు, చాహల్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ లక్ష్యం 35 ఓవర్లకి 255 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (10) పేలవరీతిలో రనౌటవగా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (36: 36 బంతుల్లో 5×4) సిరీస్లో తొలిసారి ఫర్వాలేదనిపించాడు. దీంతో విజయ భారం కోహ్లీ మీదనె పడింది. రెండో వన్డేలో శతకంతో మళ్లీ జోరందుకున్న కోహ్లీ.. ఈ మ్యాచ్లోనూ మూడంకెల స్కోరుతో చెలరేగిపోయాడు. వెస్టిండీస్ బౌలర్లని ఉతికారేశాడు. నాలుగో స్థానంలో ఆడిన రిషబ్ పంత్ (0) ఈసారి గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.
అనంతరం ఐదో స్థానంలో ఆడిన శ్రేయాస్ అయ్యర్ (65: 41 బంతుల్లో 3×4, 5×6) బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. శ్రేయాస్తో కలిసి విరాట్ కోహ్లీ నాలుగో వికెట్కి 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో భారత్ 32.3 ఓవర్లలోనే 256/4తో అలవోకగా విజయాన్ని అందుకుంది.