ప్రపంచకప్లో ఫేవరెట్గా అడుగుపెట్టి ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించిన భారత్.. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆఫ్ఘనిస్థాన్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. శనివారం ఇక్కడి రోస్బౌల్ స్టేడియంలో బలమైన భారత బ్యాటింగ్కు.. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ త్రయానికి మధ్య పోరు జరుగనుంది.
భువనేశ్వర్ స్థానంలో మొహమ్మద్ షమీని తీసుకోవడం ఒక్కటే భారత్ తుది జట్టులో చేయనున్న మార్పుగా కనిపిస్తోంది. ఫిట్ నెస్ జాగ్రత్తల దృష్ట్యా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను ఆడించడం ఇబ్బందికరంగా భావిస్తే దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ లలో ఒకరికి స్థానం దక్కొచ్చు.ఇప్పటికే మెగాటోర్నీలో సగం మ్యాచ్లు పూర్తైన తరుణంలో.. చిన్న జట్లతో మ్యాచ్లను ఫేవరెట్లు రన్రేట్ మెరుగుపరుచుకునేందుకు వాడుకుంటున్నాయి. అదే కోవలో మనవాళ్లు టాస్ గెలిస్తే మొదట భారీ స్కోరు చేసి రన్రేట్ పెంచుకోవాలనే భావనలో ఉన్నారు.
ఓపెనర్ రోహిత్ రెండు సెంచరీలతో ఫామ్ ను చాటగా, కెప్టెన్ కోహ్లీ నుంచి శతకం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇకపై టోర్నీ అంతా పూర్తిస్థాయి ఓపెనర్ గా బాధ్యత మోయాల్సిన నేపధ్యంలో అందుకు తగినట్లుగా సిద్ధమయ్యేందుకు కేఎల్ రాహుల్ కు ఈ మ్యాచ్ సరైన వేదిక.
ఐపీఎల్లో అత్యంత ప్రమాదకర బౌలర్గా గుర్తింపు పొందిన మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో కనిపిస్తున్నాడు. గత మ్యాచ్లో ఏకంగా వందకు పైగా పరుగులిచ్చుకున్న రషీద్ తన కోటా కూడా పూర్తి చేయలేకపోయాడు. బుమ్రా, షమీల పేస్ను ఎదుర్కొనడమే సవాలంటే… స్పిన్ ద్వయం చహల్, కుల్దీప్లను కాచుకోవడం అఫ్గాన్ బ్యాట్స్మెన్కు శక్తికి మించిన పనే.