ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ బౌలర్లు విజృంభించారు. ఆటలో రెండో రోజైన శుక్రవారం స్పిన్నర్ అశ్విన్ (3/50), ఇషాంత్ శర్మ (2/31), జస్ప్రీత్ బుమ్రా (2/34) రాణించడంతో వరుసగా వికెట్లు చేజార్చుకున్న ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆసిస్ 191/7.
రెండో రోజు ఆటలో భారత బౌలర్లు మెరుగైన ఆటను ప్రదర్శించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 88 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ (61 బ్యాటింగ్: 149 బంతుల్లో 6×4), మిచెల్ స్టార్క్ (8 బ్యాటింగ్: 17 బంతుల్లో 1×4) ఉండగా.. ఆ జట్టు భారత్ కంటే 59 పరుగులు ఇంకా తొలి ఇన్నింగ్స్లో వెనకబడి ఉంది. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 250 పరుగులకి ఆలౌటైన విషయం తెలిసిందే.
అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 250/9తో ఈరోజు తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన భారత్ జట్టు.. తొలి బంతికే మహ్మద్ షమీ (6) రూపంలో ఆఖరి వికెట్ చేజార్చుకుంది.ఆటను ప్రారంభించిన ఆసిస్కు మొదటి ఓవర్లోనే ఇషాంత్ షాక్ ఇచ్చారు. తొలి ఓవర్ మూడో బంతికి ఫించ్ బౌల్డ్ కావడంతో ఆసీస్కు ఆదిలోనే షాక్ తగిలింది.
స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వరుస విరామాల్లో ఓపెనర్ హారిస్ (26: 57 బంతుల్లో 3×4), షాన్ మార్ష్ (2: 19 బంతుల్లో)తో పాటు ఉస్మాన్ ఖావాజాని కూడా తన మాయాజాలంతో బోల్తా కొట్టించాడు. దీంతో.. ఆస్ట్రేలియా 87/4తో ఇబ్బందుల్లో పడింది.
అయితే హ్యాండ్స్కాంబ్-ట్రావిస్ హెడ్లు కుదురుగా బ్యాటింగ్ చేయడంతో తిరిగి ఆసీస్ గాడిలో పడింది. కాగా, టీ విరామం తర్వాత ఆసీస్ స్కోరు 120 పరుగుల వద్ద ఉండగా హ్యాండ్స్కాంబ్ ఐదో వికెట్గా ఔటయ్యాడు. అటుపై కెప్టెన్ పైనీ కూడా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో ట్రావిస్ హెడ్తో జత కలిసిన ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే యత్నం చేశాడు.
ఈ జోడి 50 పరుగుల జత చేసిన తర్వాత కమిన్స్ను బూమ్రా ఎల్బీడబ్యూ చేశాడు. దాంతో ఆసీస్ 177 పరుగుల వద్ద ఏడో వికెట్ను చేజార్చుకుంది. ఒకవైపు ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకున్నా ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ కోల్పోయిన ఏడు వికెట్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా, ఇషాంత్లు తలో రెండు వికెట్లు తీశారు.