ఆసిస్తో టెస్ట్ సమరానికి సర్వం సిద్ధం అయ్యింది. అడిలైడ్లో జరిగే మొదటి టెస్ట్ సమరానికి ఇరు జట్లు సర్వసన్నద్ధం అయ్యాయి. టాప్ ర్యాంకర్ టీమిండియా…ఆస్ట్రేలియాతో అసలు సిసలు ‘టెస్ట్’కు సన్నద్ధమైంది. కంగారూ టీమ్ను వారి సొంతగడ్డపై ఓడించాలని విరాట్ కొహ్లీ సారధ్యంలోని భారత జట్టు సై అంటోంది.
ఆతిథ్య ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టీమ్ పైన్ తొలి మ్యాచ్లో బరిలోకి దిగే తుది జట్టును ప్రకటించగా.. భారత సారథి విరాట్ కోహ్లి మాత్రం 12 మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించాడు. ఆరో స్థానం కోసం రోహిత్, విహారి మధ్య పోటీ ఉంటుందని ఈ సందర్భంగా కోహ్లి చెప్పుకొచ్చాడు. ఈ పన్నెండు మంది సభ్యుల నుంచే తుది జట్టును ఎంపిక చేస్తారు.
డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది. వామప్ మ్యాచ్ ఆడుతుండగా గాయపడిన పృథ్వీ షా అడిలైడ్ టెస్ట్కు దూరమయ్యాడు. దీంతో ఫస్ట్ టెస్ట్లో మురళీ విజయ్తో కలిసి కె ఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించడం దాదాపు ఖాయమైంది. చటేశ్వర్ పుజారా, విరాట్ కొహ్లీ, అజింక్య రహానే,రిషబ్ పంత్లతో మిడిలార్డర్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.