మెల్బోర్న్లో జరుగుతున్న మూడో వన్డేలో చావల్ దెబ్బకు ఆసిస్ కుదేలయ్యింది. 50 ఓవర్లు ఆడకుండానే 48.4 ఓవర్లకే చేతులెత్తేసింది. ఒవైపు నుంచి చాహాల్ ఆసీస్ లైనప్ ను దెబ్బతీస్తూ 6 వికెట్లు సాధించిన వేళ, మరోవైపు నుంచి భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ రెచ్చిపోగా, ఆసీస్ జట్టు 48.4 ఓవర్లలోనే 230 పరుగులకు ఆలౌటైంది.
టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ధాటికి ఓపెనర్లు కారే (5), ఫించ్ (14) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు. 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ను మార్ష్, ఖవాజా ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇన్నింగ్స్ 24వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్లో మొదటి బంతినే హిట్ చేసేందుకు షాన్ మార్ష్ (39: 54 బంతుల్లో 3×4) క్రీజు వెలుపలికి వచ్చాడు. కానీ.. చాహల్ తెలివిగా బంతిని వైడ్ రూపంలో లెగ్సైడ్ విసరగా.. దాన్ని చాకచక్యంగా అందుకున్న ధోనీ స్టంపౌట్ చేశాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని అంచనా వేయడంలో తడబడిన ఉస్మాన్ ఖవాజా (34: 51 బంతుల్లో 2×4) చాహల్కే సులువైన క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
చాహల్ ధాటికి ఖవాజా (34), షాన్ మార్ష్ (39), హండ్స్కాంబ్ (58), స్టోయిన్స్ (10), రిచర్డ్సన్ (16), జంపా (8) పెవిలియన్ చేరారు. కెరీర్లో మొదటి సారి ఆరు వికెట్లు దక్కించుకుని చాహల్ సత్తా చాటాడు. మ్యాక్స్వెల్ (26), స్టాన్లేక్ (0) వికెట్లను షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది.
ఆసీస్ బ్యాట్స్మెన్లో హాండ్స్కాంబ్ (58) మాత్రమే అర్ధశతకం సాధించాడు. మిగిలిన వారిలో షాన్ మార్ష్ (39), ఖవాజా (34) చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. భారత బౌలర్లలో చాహల్ ఆరు వికెట్లు పడగొట్టగా, షమీ, భువీ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.