ఆసీస్ గడ్డపై ఆతిధ్య జట్టును చిత్తుగా ఓడించి చరిత్ర సృష్టించిన టీం ఇండియా.. సొంతగడ్డపై కూడా కంగారూలతో పోటీకి సిద్దమవుతోంది. ఐదు వన్డేలు, రెండు టీ20లు టీమిండియా ఆడనుంది. ఇటీవల టీ20, వన్డే జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. త్వరలో జరిగే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకొని టీమిండియాను ప్రకటించారు సెలక్టర్లు. ఇప్పటికే విశాఖ వేదికగా జరిగే తొలి టీ-20 కోసం ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.అయితే ఈ సిరీస్ ఆరంభానికి ముందు టీం ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది.
ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం తాజాగా సిద్ధమవుతున్న హార్దిక్ పాండ్య.. మళ్లీ గాయపడ్డాడు. వెన్నునొప్పితో అతను సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వచ్చే వారం నుంచి చికిత్స పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాండ్యా స్థానంలో ఎవరిని తీసుకునేది మాత్రం చెప్పలేదు. కానీ.. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.