విండీస్తో జరిగిన చివరిదైన మూడో టీ20లో భారత విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. చివరి వరకు సాగిన ఉత్కంఠ పోరులో కోహ్లీ సేన వెస్టిండీస్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇరుజట్ల స్కోర్లు సమం అయ్యాక ధావన్ అవుటవంతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఐతే చివరి బంతికి మనీశ్ పాండే సింగిల్ తీయడంతో టీమిండియా గెలిచింది.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోరు సాధించింది. షాయ్ హోప్ 24, షిమ్రన్ హెట్మయెర్ 26, డారెన్ బ్రావో 43 పరుగులు చేయగా, చివర్లో నికోలస్ పూరన్ చెలరేగిపోయాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 53 పరుగులు చేశాడు.
182 పరుగుల భారీ టార్గెట్తో వెస్టిండీస్ విసిరిన కఠిన సవాల్ను.. శిఖర్ ధావన్ (92: 62 బంతుల్లో 10×4, 2×6), రిషబ్ పంత్ (58: 38 బంతుల్లో 5×4, 3×6) మెరుపులు మెరిపించడంతో భారత్ జట్టు సరిగ్గా 20 ఓవర్లలో 182/4తో ఛేదించేసింది. కీమోపాల్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి టీమిండియా సారథి రోహిత్ శర్మ (4) బ్రాత్వైట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 45 పరుగుల వద్ద కేఎల్ రాహుల్(17) కూడా అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్తో కలిసి ఓపెనర్ శిఖర్ ధవన్ విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీలకు పంపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
19వ ఓవర్లో కీమోపాల్ వేసిన రెండో బంతికి అనవసర షాట్ కోసం ప్రయత్నించిన పంత్ (58) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత చివరి రెండు బంతుల్లో విజయానికి ఒక్క పరుగు కావాల్సి ఉండగా ధవన్ (92) భారీ షాట్కు ప్రయత్నించి పొలార్డ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. అయితే, చివరి బంతికి పాండే సింగిల్ తీయడంతో భారత్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్తో భారత్లో వెస్టిండీస్ జట్టు సుదీర్ఘ పర్యటన ముగియగా.. రెండు టెస్టుల సిరీస్ని 2-0తో, ఐదు వన్డేల సిరీస్ని 3-1తో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
భారత పర్యటనలో మూడు ఫార్మట్ల సిరీస్లనూ విండీస్ జట్టు కోల్పోయింది. 2 వన్డేలు, 5 టెస్టులు, 3 టీ20 మ్యాచుల్లో..ఒక్క పూణె వన్డేలో మాత్రమే విండీస్ జట్టు గెలవడం గమనార్హం. వైజాగ్ వన్డే ‘టై’ కాగా..మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ పరాజయం పాలైంది. దాంతో ఇండియా టూర్లో విండీస్కు అన్నీ చేదు జ్ఞాపకాలే మిగిలాయి. ఓటమి నేర్పిన గుణపాఠాలతో తిరిగి స్వదేశానికి పయనమవుతోంది.