ఒకే పర్యటనలో రెండు సిరీస్లు గెలిచిన తొలి జట్టుగా భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో జరుగుతోన్న భారత్-దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ సిరీస్లో ఈ రోజు ఐదో టీ20 జరిగింది. ఇందులో ధాటిగా ఆడిన భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 54 పరుగుల తేడాతో జట్టు గెలుపొందింది.
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఈ రోజు జరిగిన చివరి టీ20 మ్యాచ్లో భారత్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ని 3-1తో కైవసం చేసుకుంది. నాలుగో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. ఈ సిరీస్ కంటే ముందు జరిగిన మూడు వన్డేల సిరీస్ని 2-1 తేడాతో భారత్ గెలిచిన విషయం తెలిసిందే.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు భారత్ని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్ మిథాలీ రాజ్ (62: 50 బంతుల్లో 8×4, 3×6), జమ్మీ (44: 34 బంతుల్లో 3×4, 2×6), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (27 నాటౌట్: 17 బంతుల్లో 1×4, 2×6) దూకుడుగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు భారత్కి ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో.. ఆ జట్టు 18 ఓవర్లలోనే 122 పరుగులకు కుప్పకూలిపోయింది. మరిజానె కప్ (27: 21 బంతుల్లో 1×4, 2×6) చోలే ట్రయాన్ (25: 17 బంతుల్లో 2×6) కాసేపు భారీ షాట్లతో కంగారుపెట్టినా.. బౌలర్లు శిఖ పాండే (3/16), రాజేశ్వరి (3/26), రుమేలి ధార్ (3/26) లయ తప్పకుండా బౌలింగ్ చేసి భారత్ని గెలిపించారు.టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.