ఇటీవల న్యూజిలాండ్ లో ఐదు టీ20ల సిరీస్లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ పరుగుల వరద చూపించాడు. దాంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నెం.1 ర్యాంక్కి కేఎల్ రాహుల్ చేరువయ్యాడు. సోమవారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో 823 పాయింట్లతో రాహుల్ రెండో స్థానంలో నిలవగా.. పాకిస్థాన్ అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ బాబర్ అజామ్ 897 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ 673 పాయింట్లతో పదో స్థానానికి పరిమితమయ్యాడు. కివీస్తో ఐదు టీ20లో ఏకంగా 224 పరుగులు చేశాడు రాహుల్. సిరీస్ సక్సెస్ లో ముఖ్యపాత్ర పోషించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ సిరీస్లో 4 మ్యాచ్లాడినా.. 105 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో.. పదో స్థానానికి కోహ్లీ పడిపోయాడు.
భారత్ తరఫున టాప్-10లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మాత్రమే నిలవగా.. ఓపెనర్ రోహిత్ శర్మ 662 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. టీ20 బౌలింగ్, ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో టాప్-10లో కనీసం ఒక్క భారత క్రికెటర్ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 630 పాయింట్లతో 12వ స్థానంలో నిలవగా.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 567 పాయింట్లతో 20వ ర్యాంక్తో సరిపెట్టాడు.