ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోవాలన్న ముంబయి ఇండియన్స్ ఆశలపై నీళ్లు చల్లింది ఢిల్లీడేర్ డేవిల్స్ జట్టు. ప్లేఆఫ్ రేస్నుంచి తప్పుకున్న ఢిల్లీ రోహిత్ సేనపై విజయం సాధించింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆ జట్టు ఢిల్లీ డేర్డెవిల్స్ చేతిలో అనూహ్యంగా 11 పరుగుల తేడాతో ఓడింది.
తొలుత యువ హిట్టర్ రిషబ్ పంత్ (64: 44 బంతుల్లో 4×4, 4×6), విజయ్ శంకర్ (43 నాటౌట్: 30 బంతుల్లో 3×4, 2×6) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసిన ఢిల్లీ.. అనంతరం ఛేదనకు దిగిన ముంబయిని 19.3 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూల్చింది.
ముంబై చావోరేవో తేల్చుకునే లక్ష్యం 175. సులువైంది కాకపోయినా… అసాధ్యమైంది మాత్రం కాదు. కానీ ముంబై బ్యాట్స్మెన్ స్పిన్ ఉచ్చులో చిక్కి ఉక్కిరిబిక్కిరయ్యారుతప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో ఒత్తిడికి గురైన ముంబయి బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ (12), ఇషాన్ కిషన్ (5), కీరన్ పొలార్డ్ (7), రోహిత్ శర్మ (13), క్రునాల్ పాండ్య (4) తక్కువ స్కోరుకే వికెట్ చేజార్చుకోగా.. ఓపెనర్ ఎవిన్ లూవిస్ (48: 31 బంతుల్లో 3×4, 4×6), హిట్టర్ బెన్ కటింగ్ (37: 20 బంతుల్లో 2×4, 3×6) మెరుపులతో ఢిల్లీ శిబిరంలో కంగారు రేకెత్తించారు.
ముఖ్యంగా..121/6 దశలో క్రీజులో వచ్చిన బెన్ కటింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ షాట్లు ఆడటంతో.. 18 బంతుల్లో 38గా ఉన్న సమీకరణం.. చివరికి 6 బంతుల్లో 18 పరుగులుగా మారిపోయింది. ఇన్నింగ్స్ 20వ ఓవర్లోనూ తొలి బంతికే సిక్స్ కొట్టిన బెన్ కటింగ్ తర్వాత బంతికి ఔటవడంతో ఢిల్లీ ఊపిరి పీల్చుకుంది. ఢిల్లీ ఫీల్డర్ మాక్స్వెల్ రెండు అద్భుతమైన క్యాచ్లతో మ్యాచ్ని మలుపుతిప్పాడు. ఢిల్లీ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.