బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ.. టీవీల ముందు కూర్చున్న వారి గుండెల్ని చేతుల్లోకి తెస్తూ.. అభిమానులను సీట్ల అంచుల నుంచి మునివేళ్లపైకి తీసుకొస్తూ.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఐపీఎల్ ఫైనల్లో చివరకు ముంబైనే విజయం వరించింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నైపై ముంబయ్ గెలిచి నాలుగో సారి ఐపీఎల్ టైటిల్ను ఎగరేసుకుపోయింది.
బ్యాటింగ్ వైఫల్యంతో 149 పరుగులకే పరిమితమై… చెత్త ఫీల్డింగ్, క్యాచ్లు, రనౌట్లు వదిలేసి కూడా చివరకు చిరకాల ప్రత్యర్థి చెన్నైపై పైచేయి సాధించగలిగింది. చార్మినార్ కోటలో ‘చార్ మార్’ చేస్తూ నాలుగోసారి ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు పోటీలు పడి వికెట్లు తీస్తుంటే ముంబై విలవిల్లాడింది. ఒకానొక దశలో 100 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. మెరుపులు మెరిపిస్తారని ఆశలు పెట్టుకున్న హార్ధిక్ పాండ్యా నీల్లు చల్లారు. పొలార్డ్ పుణ్యమాని 149 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేసింది.చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు తీసుకోగా, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు
కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డి కాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు.
150 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన చెన్నై చివరి బంతి వరకు పోరాడి ఓడింది. 148 పరుగులకు పరిమితమై ఒక్క పరుగు తేడాతో ఓడింది.షేన్ వాట్స్ మెరిసినప్పటికీ మిగతా వారు విఫలం కావడంతో ఓటమి పాలైంది. 59 బంతులు ఎదుర్కొన్న వాట్సన్ 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. ఫా డుప్లెసిస్ 26 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్రావో ఒక్కడే 15 పరుగులు చేశాడు. మిగతా వారెవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
షేన్ వాట్సన్ నిలకడగా ఆడుతున్నప్పటికీ రైనా, రాయుడు వెంటవెంటనే ఔట్ అవడంతో 70 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రాయుడు కేవలం 1 పరుగు చేసి ఔట్ అవ్వగా, నాటకీయ పరిణామాల మధ్య రనౌటవడంతో చెన్నై కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్రేవోతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. 15 ఓవర్లో మలింగా వేసిన ఓవర్లో షేన్ వాట్సన్ ఏకంగా 19 పరుగులు పిండుకున్నాడు. అంతే కాదు 17వ ఓవర్లో వాట్సన్ ఏకంగా మూడు సిక్సర్లు బాదడంతో చెన్నై స్కోరు బోర్డు వేగంగా కదిలింది. బ్రేవో (15) ఔటైనా, వాట్సన్ గెలిపించే స్థితిలో నిలిచాడు. అయితే చివరకు అదృష్టం సూపర్ కింగ్స్ మొహం చాటేసింది.
చివరి ఓవర్లో విజయానికి కావాల్సింది 9 పరుగులే. క్రీజులో వాట్సన్ ఉండడంతో చెన్నై విజయం నల్లేరు మీద నడకేనని అనుకున్నారు. కానీ, మలింగ వేసిన ఆఖరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో నాలుగు పరుగులే వచ్చాయి. ఐదో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో వాట్సాన్ రనౌట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం కాగా, ఐదో బంతికి రెండు పరుగులే వచ్చాయి. ఆఖరి బంతికి విజయానికి రెండు పరుగులే అవసరం. కానీ శార్దూల్ వికెట్ల ముందు దొరికిపోవడంతో ముంబై అభిమానులు స్టేడియంలో హోరెత్తించారు.
ఆరంభంలో డి కాక్, ఆ తర్వాత పొలార్డ్ మినహా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో జోష్ కనిపించలేదు. జట్టు ఇన్నింగ్స్లో మొత్తం 9 ఫోర్లే ఉన్నాయి. అంతకుముందు ఓవర్లో భారీగా పరుగులిచ్చినా దీపక్ చహర్తో మళ్లీ బౌలింగ్ వేయించిన ధోని వ్యూహం పని చేసింది. చక్కటి బంతిని డ్రైవ్ చేయబోయి కెప్టెన్ రోహిత్ శర్మ (14 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ ఓవర్ మెయిడిన్గా కూడా ముగిసింది. క్వాలిఫయర్ హీరో సూర్య కుమార్ (17 బంతుల్లో 15; ఫోర్) తడబడుతూ ఆడగా, కృనాల్ పాండ్యా (7 బంతుల్లో 7) విఫలమయ్యాడు. మరోవైపు ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు) కొద్దిగా నిలిచినా వేగంగా ఆడలేకపోవడంతో రన్రేట్ బాగా తగ్గింది.