ప్రపంచకప్ నుంచి వైదొలగడంతో ధోని రిటైర్మెంట్పైనె చర్చంతా సాగింది. ధోని రిటైర్మెంట్ ఇస్తాడా? మరికొద్ది రోజులు కొనసాగుతాడా? ఆదివారం వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసే జట్టులో ధోనికి చోటు దక్కుతుందా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. వాటన్నింటికి చెక్ పెట్టారు ధోని. ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఆలోచన లేదని తేల్చి చెప్పాడు. కానీ త్వరలో జరిగే వెస్టిండీస్ టూర్కు మాత్రం అందుబాటులో ఉండబోనని స్పష్టం చేశాడు.
గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ.. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే రెండు నెలలూ తన పారామిలిటరీ రెజిమెంట్తో కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2 నెలలపాటు క్రికెట్కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ధోనీ స్వయంగా తమను కలిసి వివరించాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ విషయాన్ని ఛీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలకు చెప్పామన్నారు.
ధోని గైర్హాజరితో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు చోటుదక్కనుండగా.. టెస్ట్లకు వృద్ధిమాన్ సాహా పేరును పరిశీలించే అవకాశం ఉంది. ఇక విండీస్ పర్యటనకు భారత జట్టును ఆదివారం ప్రకటించనున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్లోస్లో బ్యాటింగ్తో జట్టుకు భారంగా మారుతున్న ధోని ఇక ఆటకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ధోని ఇప్పుడే రిటైర్మెంట్ ఆలోచన చేయడంలేదని చిరకాల మిత్రుడు, వ్యాపార వ్యవహరాలు చూసే అరుణ్ పాండే స్పష్టం చేశారు.