ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోవడం ఏ జట్టుకైనా ఇప్పుడు కష్టంగా మారింది. అసీస్ ను వారి గడ్డపై ఓడించడం అంత సులువు కాదు. ప్రపంచ క్రికెట్ లో అసీస్ ను వారి గడ్డపై ఓడించే సత్తా ఒక్క కోహ్లీసేన కే ఉందని ఇంగ్లండ్ మాజీ కెఫ్టెన్ మైకేల్ వాన్ అన్నారు. అడిలైడ్ ఓవల్ వేదికగా పాకిస్తాన్తో ముగిసిన రెండో (డే/నైట్) టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది.
అయితే మైకేల్ వాన్ తన ట్వీటర్ ద్వారా భారత జట్టు ప్రదర్శనను ప్రస్తావించాడు. ’అసీస్ జట్టును దాని గడ్డపై ఓడించడం కష్టం. వారిని ఓడించాలంటే కేవలం కోహ్లీసేనకే సాధ్యం అవుతుందని అన్నారు. ప్రస్తుతం టీమిండియా చాలా పటిష్టంగా ఉందని” వాన్ పేర్కొన్నారు. టీమిండియా ప్రస్తుతం టెస్టుల్లో నంబర్వన్. ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా కోహ్లీసేనకు ఉంది.
ఎక్కడైనా, ఏ జట్టుపైనైనా 20 వికెట్లు తీయగల సత్తా భారత బౌలర్లకు ఉంది. గతేడాది ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపైనే ఓడించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు నిషేధం కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లు జట్టుకు దూరమయ్యారు. ఇక 1999 నుంచి ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై పాక్ కనీసం ఒక్క మ్యాచ్ను కూడా డ్రా చేసుకోలేకపోయింది. చివరిసారిగా పాక్ 1995లో విజయం సాధించింది.