ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో మురళీ విజయ్, విరాట్ కోహ్లి శతకాలతో చెలరేగారు. నాగ్పూర్ టెస్టులో శతకం చేసిన విజయ్.. లంకపై వరుసగా రెండో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇద్దరూ సెంచరీలు చేయడంతో గ్రౌండ్లో అసక్తికర సన్నివేశం నెలకొంది.
భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ తన సహచర ఆటగాడు మురళీ విజయ్తో కలిసి మైదానంలో డాబ్ డ్యాన్స్ చేశారు. టెస్టు, వన్డే, టీ20 ఏ ఫార్మాట్లో అయినా సరే ఆటగాళ్లు 50, 100 సాధించినప్పుడు తమ ఆనందాన్ని ఒక్కోలా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది మనం తరచూ చూస్తూనే ఉంటాం.
తాజాగా శ్రీలంకతో జరుగుతోన్న మూడో టెస్టులో 56వ ఓవర్లో భారత ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీ పూర్తి చేశాడు. వెంటనే విజయ్ తన బ్యాట్, హెల్మెట్ పక్కన పడేసి సరదాగా డ్యాన్స్ చేశాడు. అనంతరం తన శతక ఆనందాన్ని కోహ్లీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. డాబ్ డ్యాన్స్ చేద్దామని విజయ్ అడగగానే కోహ్లీ ఓకే అన్నాడు. ఇద్దరూ కలిసి మైదానంలో డాబ్ డ్యాన్స్ చేసి అభిమానుల్ని అలరించారు.