క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా సుభవార్తే. ఎందుకంటె ఒలంపిక్స్ లో క్రికెట్ ను చేర్చే అంశం మరో సారి తెరపైకి వచ్చింది. అందుకు తగ్గట్టే 2028 ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టడానికి ఐసీసీ ప్రయత్నాలు చేస్తోందని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ ప్రపంచ క్రికెట్ కమిటీ ఛైర్మన్ మైక్ గాట్టింగ్ పేర్కొన్నాడు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని క్రీడా సమాఖ్యలను పర్యవేక్షించే వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ)కు అనుబంధంగా కొనసాగుతున్న నాడా(నేషనల్ ఆంటీ డోపింగ్ ఏజెన్సీ) పరిధిలోకి ఇటీవలే బీసీసీఐ చేరడంతో..ఒలంపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశ పెట్టడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
2028 ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని, అందుకు తగిన కార్యాచరణ ప్రారంభించామని ఐసీసీ కొత్త ముఖ్య కార్యదర్శి మనుసావ్నే ఎంసీసీ కమిటీతో అన్నాడని గాట్టింగ్ పేర్కొన్నాడు. అయితే ఈ ఆటలు నెలరోజుల పాటు కాకుండా రెండు వారాల్లోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాడు. అన్ని పురుష జట్లతో పాటు మహిళల జట్లూ ఇందులో పాల్గొంటాయని వివరించాడు.