ప్రపంచకప్లో భారత్ , పాకిస్థాన్ మ్యాచ్ అంటే దానికి విపరీతమైన క్రేజ్ ఉంది. దాయాది దేశాలు తలపడుతున్నాయంటే ఆస్టేడియం అభిమానులతో కిక్కిరిసి పోవాల్సిందే. కాని ఈసారి అభిమానులకు షాక్ తగలనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సారి ప్రపంచ కప్లో దాయాదుల పోరు ఉండక పోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాక్పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను యుద్ధభూమిలోనే ఎదుర్కోవాలని క్రికెటర్ గౌతమ్ గంభీర్తో పాటు చాలామంది భారతీయులు కోరుకుంటున్నారు. ఇప్పటికే దాయాది దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 200 శాతం పెంచేసిన భారత ప్రభుత్వం ఇప్పుడు మరో షాక్కు ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.
ఇప్పటికే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లకు ఎప్పుడో బ్రేక్ పడింది. కేవలం అంతర్జాతీయ టోర్నమెంట్స్ సమయంలో మాత్రమే భారత్, పాకిస్థాన్ తలబడుతున్నాయి. వచ్చే వరల్డ్కప్లో జూన్ 16న ఇంగ్లండ్లోని మాంచెస్టర్ వేదికగా ఇండో-పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పుడు పుల్వామా దాడి ఫలితంగా ఈ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా పాక్తో క్రికెట్ మ్యాచ్లను మొత్తం నిషేధించాలనే ప్రతిపాదనను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తెరపైకి తీసుకొచ్చింది. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రసారాలను కూడా నిషేధించారు. ఈ మేరకు బీసీసీఐని కోరాం’ అని సీసీఐ సెక్రటరీ సురేశ్ బఫ్నా తెలిపారు. పుల్వామా దాడి ఘటన గురించి పాక్ ప్రధాని, మాజీ క్రికెట్ సారథి ఇమ్రాన్ ఖాన్ స్పందించకపోవడం కూడా ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే విషయంలో సందేహాలు నెలకొనడానికి కారణమయ్యాయి. ఇప్పటికే షెడ్యూల్ ఖరారయిన నేపథ్యంలో భారత్- పాక్ మధ్య మ్యాచ్ ఉంటుందా లేదా అన్నది ఉత్కంటంగా మారింది.