ధోనికి ప్రత్యామ్నాయంగా దూసుకొచ్చారు యువ కీపర్ రిషబ్ పంత్. ధోనిని పక్కన పెట్టడంపై సెలక్టర్లమీద ఎన్ని విమర్శలు వచ్చినా పంత్ కే అవకాశం ఇచ్చారు. కొన్ని మ్యాచ్ ల్లో పంత్ ఘోరంగా విఫలం అయినా అవకాశాలు ఇచ్చిన సెలక్టర్ల నమ్మకాన్ని వమ్ముచేయలేదు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్థానాన్ని భర్తీ చేయగలడని నిరూపించుకుంటున్నాడు. తాజాగా ధోని రికార్డును బద్దలు కొట్టాడు పంత్.
11వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న పంత్.. ధోని రికార్డును అధిగమించి తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో వేగంగా 50 ఔట్లు చేసిన భారత వికెట్ కీపర్గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ధోని 15 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించగా పంత్ 11 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని చేరాడు. విండీస్ తో జరుగుుతన్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఇషాంత్ శర్మ బౌలింగ్లో బ్రాత్వైట్ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
అంతర్జాతీయ టి20ల్లో చాలా కాలంగా ఎంఎస్ ధోని పేరిట ఉన్న రికార్డును రిషబ్ పంత్ ఇంతకుముందే బద్దలు కొట్టాడు. టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా వికెట్ కీపర్గా తన పేరును లిఖించుకున్నాడు.