ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో జట్టు కోచ్, కెప్టెన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమి ప్రభావం ఇప్పుడు కెప్టెన్సీపై పడింది. త్వరలో విండీస్ పర్యటనకు టీమిండియా జట్టు సిద్దమవుతోంది. ఆగస్టు 3న ప్రారంభంకానున్న ఈ టూర్లో విండీస్తో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులని టీమిండియా ఆడనుంది.
వెస్టిండిస్ పర్యటనలో ఎవరికి విశ్రాంతినివ్వాలి.. ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై భారత సెలక్టర్లు తలమునకలై ఉన్నారు. ప్టెన్ విరాట్ కోహ్లీ, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్య, చాహల్, కుల్దీప్, భువనేశ్వర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్-12 సమయంలోనే ధోనీ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ప్రపంచకప్ టోర్నీ మధ్యలో ధోనీ చేతి వేళ్లకు బంతి బలంగా తాకడంతో గాయమైంది. వచ్చే ఏడాది నుంచి టీమిండియా విరామం లేకుండా అంతర్జాతీయ క్రికెట్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ధోనీకి విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నాట్లు తెలుస్తోంది.
విండిస్ పర్యటన ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ జులై 17 లేదా 18న ముంబైలో సమావేశమై టీ20, వన్డే, టెస్టు సిరీస్లకు జట్టుని ప్రకటించనున్నారు.పేసర్ భువనేశ్వర్కుమార్ స్థానంలో పేసర్లు ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్లలో ఎవరో ఒకరిని జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉంది. విండిస్ పర్యటనలో విరాట్ కోహ్లీకి విశ్రాంతినిస్తే రోహిత్ శర్మ వన్డేల్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహారిస్తాడు. టెస్టు సిరిస్కు రహానే నాయకత్వం వహించనున్నారు.