లిటిల్ మాస్టర్, రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్ కు ఈ రోజు గుర్తుండిపోయె రోజు. మొదటి అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసింది ఈ రోజే(ఆగస్టు14,1990).1990లో జరిగిన భారత్xఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో సచిన్ తొలిసారిగా మూడంకెల స్కోరుని అందుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 68 పరుగులే బాదిన లిటిల్ మాస్టర్ రెండో ఇన్నింగ్స్లో అజేయంగా 119 పరుగులు చేశాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
గ్రాహం గూచ్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 519 పరుగులు చేయగా, ఇండియా 408పరుగులు చేసింది. ఇందులో సచిన్ అర్ధసెంచరీ(68) కూడా ఉంది. 87పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ 320పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇండియాకు 408పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
408 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 110పరుగులకే టాపార్డర్ వికెట్లను చేజార్చుకుంది. కాని సచిన్ ఒక్కడే నిలబడి ఇంగ్లండ్ కు పరీక్ష పెట్టాడు. ఓపిగ్గా ఆడిన సచిన్ 17 బౌండరీల సాయంతో 119పరుగులు చేశాడు. వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును 343/6తో పటిష్ఠ స్థితిలో నిలిచేలా చేశాడు. దీంతో భారత్ టెస్టును డ్రాగా ముగించింది.
16 సంవత్సరాల చిరుప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సచిన్ ఎన్నో రికార్డుల తన పేరుమీద లిఖించుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్మన్ సచిన్. అలాగే అన్ని ఫార్మాట్లలో 34,000పైగా పరుగులు. అత్యధిక వన్డే, టెస్టు మ్యాచ్లాడిన క్రికెటర్ కూడా సచినే.