యువ క్రికెట్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మంచి ఫాంలో ఉన్నాడూ. వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా పరుగులు అద్భుతంగా చేస్తున్నాడు. ప్రస్తుతం మిడిల్ ఆర్డర్లో ఎంతో కీలక ఆటగాడిగా మారిపోయాడు. చాలా కాలంగా అయ్యర్కు సరైన అవకాశాలు రాలేదు. జట్టులో అవకాశాలపై మీడియా ముందు బాహటంగానే వెల్లడించారు. చివరకు విండీస్ పర్యటనలో అయ్యర్కు అవకాశం రావడంతో రాణించాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ సెంచరీ చేసాడు.
మ్యాచ్ అనంతరం అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నాడు. ’నా బ్యాటింగ్ మెరుగయ్యేందుకు భారత్-ఏ మ్యాచులు సాయపడ్డాయి. అక్కడ ఎక్కువగా ఒత్తిడేమీ ఉండదు. సీనియర్ స్థాయిలోనూ భిన్నంగా ఏమీ లేదు. చాలాసార్లు అక్కడ ఆడినవారే ఇక్కడుంటారు. నా అట పట్ల సంతోషంగా ఉన్నా. సెంచరీ చేసినందుకు సంతోషమే, కానీ.. మ్యాచ్ గెలిస్తే ఇంకా బాగుండేది. టీమిండియాకు మరెంతో చేస్తానన్న నమ్మకం ఉంది. కేఎల్ రాహుల్ షాట్లు అద్భుతంగా ఉన్నాయి.
అతడు బంతిని చాలా బాగా చూస్తున్నాడు. రాహుల్ తొలి సిక్స్ బాదగానే ఇదే విషయం అడిగాను. మంచి సమాధానం ఇచ్చాడు. 348 పరుగుల లక్ష్య ఛేదన ఏ జట్టుకైనా అంత సులభమేమీ కాదు. న్యూజిలాండ్ అద్భుతంగా ఆడింది. ఒకరు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగా.. మిగతావారు దూకుడుగా ఆడారు. ప్రతి ఒక్కరికీ చెడు రోజులు ఉంటాయి. మేం బాగానే ఫీల్డింగ్ చేస్తాం. కొన్ని సార్లు తప్పిదాలు జరుగుతాయి’ అని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.