అంతర్జాతీయ ప్రముఖ క్రికెట్ స్టేడియాల్లో శ్రీలంకలోని గాలె ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఒకటి. ఈ స్టేడియం ఇక కనుమరుగు కానుంది. స్టేడియం పెవిలియన్ స్టాండ్ కారణంగా యునెస్కో గుర్తింపు పొందిన 17వ శతాబ్దం నాటి కోటకు ముప్పు పొంచి ఉండడంతో దానిని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఐకానిక్ స్టేడియాన్ని 1984లో నిర్మించారు. 1998లో తొలిసారి ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగింది. అయితే, 2004 డిసెంబర్లో వచ్చి సునామీకి గాలె స్టేడియంలో చాలా భాగం దెబ్బతింది. దీంతో పునరుద్ధరణ పనుల్లో భాగంగా 2008లో పెవిలియన్ నిర్మించారు. ఇప్పుడు అదే స్టేడియం కూల్చివేతకు కారణం అవుతోంది.
17వ శతాబ్దానికి చెందిన డచ్ఫోర్ట్ను కాపాడేందుకు గాను ప్రస్తుతం ఈ స్టేడియంలోని పెవిలియన్ స్టాండ్ను కూల్చేందుకు శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం గాలెలో మరో స్టేడియంను నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు.
గాలె స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామం. 1998 నుంచి ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఆడిన మ్యాచుల్లో అత్యధిక శాతం మ్యాచులను శ్రీలంక గెలుచుకుంది. గత వారం కూడా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగానే 278 పరుగుల భారీ తేడాతో శ్రీలంక గెలిచింది. అయితే, స్టేడియాన్ని ఇప్పటికిప్పుడు కూల్చబోమని క్రీడల మంత్రి ఫెయిస్జెర్ ముస్తాఫా తెలిపారు.