వయసు పెరిగినా ఆటతీరులో చేవ తగ్గలేదని హైదరాబాద్ బ్యాటర్ మిథాలీరాజ్ నిరూపించింది. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మన్గా నిలిచిన రోహిత్శర్మ రికార్డును మిథాలీ బద్దలు కొట్టింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా రికార్డులకెక్కింది. మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన మిథాలీ… 47 బంతుల్లో 56 పరుగులతో ఆకట్టుకుంది.
అంతర్జాతీయ టీ20ల్లో 87 మ్యాచ్లాడిన రోహిత్శర్మ 33.44 సగటుతో 2,207 పరుగులు చేసి కోహ్లీని అధిగమించి టాప్లో నిలిచాడు. తాజాగా ప్రపంచకప్ టీ20 టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 57 పరుగులు చేసిన మిథాలీ 2,232 పరుగులతో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రికార్డు నమోదుచేసింది.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ 5వ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ బేట్స్ (2,913) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. విండీస్ ప్లేయర్ టేలర్ (2691), ఇంగ్లండ్ క్రికెటర్ ఎడ్వర్డ్స్(2605), ఆస్ట్రేలియా బ్యాట్స్వుమెన్ లానింగ్ (2,241) మిథాలీ కన్నా ముందు స్థానంలో ఉన్నారు. టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్, పాక్పై గెలిచి దూకుడు మీదున్న భారత మహిళా జట్టు తదుపరి మ్యాచ్ను గురువారం ఐర్లాండ్తో ఆడనుంది.