ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమిండియా ఘోర ఓటమిని బీసీసీఐ సీరియస్గా తీసుకుంది. భారత జట్టులో ప్రక్షాలన మొదలు పెట్టింది. వరల్డ్కప్ లీగ్ దశలో దాదాపు 35 శాతం టీమ్ స్కోరుని రోహిత్ శర్మ ఒక్కడే చేయగా.. విరాట్ కోహ్లీ ఐదు అర్ధశతకాలు, కేఎల్ రాహుల్ విలువైన ఇన్నింగ్స్లతో అతడికి సహకారం అందించారు. కాని ఇప్పుడు మిడిలార్డర్పైనె బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కనీసం ఒక్క మ్యాచ్లో కూడా భారత జట్టుని మిడిలార్డర్ గెలిపించలేకపోయింది.
ప్రధానంగా నెంబర్ 4 బ్యాట్స్ మెన్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఆదినుంచి టీమిండియాను నెం 4 స్థానం వెంటాడుతూనె ఉంది. ఆ స్థానంలో చాలా మంది క్రికెటర్లను పరీక్షించినా ఎవరూ కూడా నిలకడగా రాణించలేదు. ముఖ్యంగా సెమీస్లో నెం.4 బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు టీమిండియాని దారునంగా దెబ్బతీశాయి.సెమీస్లో రోహిత్ (1), రాహుల్ (1), కోహ్లి (1) సింగిల్ డిజిట్కి ఔటవగా.. మిడిలార్డర్ ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసింది.
వాస్తవానికి టోర్నీ ఆరంభంలోనే ఈ బలహీనతలపై దృష్టిపెట్టి సరిదిద్దాల్సిన బాధ్యత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ది. కానీ.. అతను తన బాధ్యత పట్ల అలక్ష్యంగా వ్యవహరించాడని చెప్పడానికి నెం.4లో ఆఖరి వరకూ టీమిండియాకి సెటిల్ బ్యాట్స్మెన్ లేకపోవడమే నిదర్శనం. గత రెండు సంవత్సరాలుగా నెంబర్ 4లో రాయుడు కొంత నిలకడగా రాణించడంతో అందరూ కూడా ప్రపంచకప్కు ఎంపిక అవుతారని ఆశించారు. కాని అనూహ్యంగా జట్టులో చోటు దక్కలేదు.
నెంబర్ 4 విషయాన్ని సీరియస్గా తీసుకున్న బీసీసీఐ తొలుత సంజయ్ బంగర్పై వేటు వేయాలని యోచిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. మిడిలార్డర్లో రిషబ్ పంత్ షాట్ సెలక్షన్, కేదార్ జాదవ్ జిడ్డు బ్యాటింగ్, దినేశ్ కార్తీక్ నిర్లక్ష్యపు ఆటతీరు, హార్దిక్ పాండ్య దూకుడు హిట్టింగ్లో.. సెమీస్ వరకూ ఏమాత్రం మార్పు కనిపించలేదన్న సంగతి తెలిసిందే. ఇంకా ఎంతమందిపై వేటు పుడతుందో చూడాలి.