న్యూజిలాండ్ పర్యటనలో భారత కెఫ్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శన సరిగ్గా లేదు. టీ20 సిరీస్లో ఓ హాఫ్ సెంచరీ తర్వాత వన్డే సిరీస్తో పాటు టెస్టుల్లోనూ రాణించలేకపోతున్నాడు. మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్ లో విఫలమైన కోహ్లీ.. శనివారం మొదలైన సెకండ్ మ్యాచ్ లోనూ ఫెయిలైయ్యాడు. లంచ్కు ముందు 15 నిమిషాల పాటు వికెట్ కాపాడుకున్న కోహ్లీ బ్రేక్ నుంచి వచ్చాక వెంటనే ఔట్ అయ్యాడు.
టిమ్ సౌథీ వేసిన స్ట్రయిట్ బాల్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే, ఈ ఎల్బీడబ్ల్యూకు విరాట్ డీఆర్ఎస్ కోరడం చర్చనీయాంశమైంది. కానీ, బంతి వికెట్లను తగులుతున్నట్టు స్పష్టంగా తెలియడంతో థర్డ్ అంపైర్ కూడా ఔటిచ్చాడు. అయితే లైన్ సరిగ్గా ఉన్నా.. బ్యాట్ ను బంతి తగలకపోయినా కూడా రివ్యూ అడటంపై ఫ్యాన్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వికెట్ కాపాడుకునేందుకే అతను సెల్పిష్ గా వ్యవహరించాడని విమర్శిస్తున్నారు.
అప్పటికే భారత్ ఓ రివ్యూ కోల్పోగా.. చేతిలో మరో ఏడు వికెట్ల సమయంలో బాధ్యతాయుత కెప్టెన్ అయితే రివ్యూ వేస్ట్ చేసి ఉండాల్సింది కాదని అంటున్నారు. డీఆర్ఎస్ల విషయంలో కోహ్లీకి ఇప్పటికే చెత్త రికార్డు ఉంది. టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అతను 14 రివ్యూలు కోరితే కేవలం రెండు సార్లు మాత్రమే సక్సెస్ అయ్యాడు. దాంతో కోహ్లీని ఇప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.