బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం నాడు ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. ఆసీస్ చేసిన 287 పరుగుల లక్ష్యాన్ని భారత్ 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (119, 128 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్సర్లు) విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు.
సెంచరీ చేసిన రోహిత్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. మ్యాచ్ తర్వాత రోహిత్ మాట్లాడుతూ… ’కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించడానికి యత్నించా. రాహుల్ ఔటైన తర్వాత కోహ్లీ, నేను కలిసి ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాం. అందుకు కెప్టెన్కు మించిన బ్యాట్స్మన్ లేడు. కోహ్లీ, నేను బాధ్యతాయుతంగా ఆడాం. ఒకరు నెమ్మదిగ, మరొకరు ధాటిగా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత సహజశైలిలో ఆడుతూ రిస్క్ చేస్తానని కోహ్లీకి చెప్పా.. ఆపై సెంచరీ సాధించా.
ఆసీస్ టాప్-3 బౌలర్ల నుంచి మాకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేసారు. అయినా 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాం. ఒకవేళ భారత్ వికెట్లు కోల్పోయింటే పరిస్థితి మరోలా ఉండేది అని తెలిపాడు. ఇక మూడో వన్డే ద్వారా రోహిత్ అరుదైన రికార్డును సాధించారు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్లలో 9,000 పరుగులు పూర్తిచేసిన మూడో బ్యాట్స్మన్గా రోహిత్ (217) రికార్డు అందుకున్నాడు.